మంత్రి కన్నుమూత: సన్నిహితుడిని కోల్పోయా : సీఎం: శోకసంద్రంలో రాష్ట్రం
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. మంగళవారం రాత్రి బెంగళూరులోని డాలర్స్ కాలనీలో గల నివాసంలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే రామయ్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమేష్ కత్తి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటవీ - పౌర సరఫరాల మంత్రిత్వ శాఖను ఆయన పర్యవేక్షించారు.

స్పృహలో లేని స్థితిలో..
రాత్రి 10:30 గంటలకు ఉమేష్ కత్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని రామయ్య ఆసుపత్రి అత్యవసర సేవల విభాగం హెడ్ డాక్టర్ అరుణ రమేష్ తెలిపారు. అప్పటికి ఆయన స్పృహలో లేరని, పల్స్ అందలేదని అన్నారు. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్న ఆయనకు అత్యాధునిక వైద్యం అందించామని వివరించారు. 11:40 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఇంట్లో ఉన్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉండొచ్చని అన్నారు.

జనతాదళ్తో ఎంట్రీ..
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ఉమేష్ ఖత్తి. బెళగావి జిల్లా హుక్కేరి తాలుకాలోని బెల్లాడ్బాగేవాడి ఆయన స్వస్థలం. 1985లో జనతాదళ్తో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయిదుసార్లు జనతాదళ్ తరఫున, మూడుసార్లు బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు.

తండ్రి స్థానంలో
ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి కూడా రాజకీయ నాయకుడే. 1985లో జనతాదళ్ అభ్యర్థిగా నుంచి హుక్కేరి నుంచి అసెంబ్లీ ఎన్నికయ్యారు.
తండ్రి మరణంతో ఖాళీ అయిన హుక్కేరి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో పార్టీ ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా హుక్కేరి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు.

ఒక్కసారే ఓటమి..
మొత్తంగా తొమ్మిదిసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉమేష్ కత్తి ఒక్కసారి మాత్రమే ఓడిపోయారంటే ఉత్తర కర్ణాటకపై ఆయనకు ఏ స్థాయిలో పట్టు ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కర్ణాటక ప్రాంతంపై ఉన్న పట్టు, లింగాయత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రులు జేహెచ్ పాటిల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీష్ షెట్టార్ కేబినెట్లో పని చేశారు.

తీరని లోటు..
బసవరాజ్ బొమ్మై కేబినెట్లో అటవీ - పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఉమేష్ కత్తి మరణం పట్ల బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిసినప్పటి - ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా శ్రమించారని చెప్పారు.

బెళగావి జిల్లాలో సెలవు..
ఉమేష్ కత్తి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో హుక్కేరికి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బెళగావి జిల్లా సంకేశ్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచనుంది. ఆయన మరణానికి సంతాప సూచకంగా ఇవ్వాళ బెళగావి జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.












Click it and Unblock the Notifications