మందుబాబులకు ఎంత కష్టం: ఈ వారంలో మూడు రోజులు మద్యం షాపులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. అయిదు కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతోన్నారు. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.
13వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సవ్యంగా సాగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసింది. ఈ సాయంత్రం పోలింగ్ సిబ్బంది మొత్తం తమకు కేటాయించిన కేంద్రాలను బయలుదేరి వెళ్లనున్నారు.

వారిని పోలింగ్ కేంద్రాలకు చేర్చడానికి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ఇదివరకే గుర్తించింది కేంద్ర ఎన్నికల కమిషన్. అలాంటి చోట్ల అదనపు పోలీసు బలగాలను మోహరించనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధించింది. మద్యం షాపులు మూత పడ్డాయి. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను బంద్ చేయాలంటూ ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను మూసివేశారు.
మద్యం అమ్మకాలు, తరలింపును నిషేధించినట్లు కర్ణాటక ఎక్స్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. మళ్లీ ఓట్ల లెక్కింపు రోజైన శనివారం కూడా మద్యం నిషేధం అమలులో ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు నిషేధం కొనసాగుతుంది. నిషేధ కాలంలో మద్యం అమ్మకాలు, తరలింపునకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.

సీఎల్ 9 లైసెన్స్ అంటే బార్లు, ఇతర రీఫ్రెష్మెంట్ రూమ్స్ను కూడా నిషేధం పరిధిలోకి తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ. బెంగళూరు, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో బార్లను మూసివేయాల్సి ఉంటుందని సూచించింది. బార్లకు అనుబంధంగా పనిచేసే ఫుడ్ రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని డోర్ డెలివరి చేయడంపైనా నిషేధం విధించింది ఆయా నగరాల్లో. కర్ణాటక వ్యాప్తంగా సీఎల్ 9 లైసెన్స్ గల బార్లు 12,000 వరకు ఉన్నాయని తెలిపింది.












Click it and Unblock the Notifications