కెసిఆర్, చంద్రబాబు: ఇద్దరూ సంజయ్ గాంధీ గూటి పక్షులే..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా తన వద్దనే పాఠాలు నేర్చుకున్నాడని అనడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలవాటుగా మారింది. తాజాగా, ఆయన మరో ముందడుగు వేసి టిడిపి లేకుంటే కెసిఆర్ సిద్ధిపేటలో గొర్రెలను కాసుకునేవారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తీవ్ర వివాదమే చెలరేగుతోంది. అయితే, ఇరువురు కూడా దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కున్నా నాలుగేళ్లు కెసిఆర్ చిన్నవాడైనప్పటికీ ఇరువురు కూడా సంజయ్ గాంధీ గూటి పక్షులేనని అర్థమవుతోంది. యువతను పార్టీలోకి తేవడానికి సంజయ్ గాంధీ చేసిన ప్రయత్నంలో భాగంగా ఇరువురు కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు పిహెచ్డిని మధ్యలో వదిలేయగా, కెసిఆర్ ఎంఎ సాహిత్యం అభ్యసించారు.
1970ల్లో సంజయ్ గాంధీ నేతృత్వంలోని యువజన కాంగ్రెసు మెదక్ జిల్లా యువజన కాంగ్రెసు ద్వారా కెసిఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు తన యుక్తవయస్సులోనే కాంగ్రెసు రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత చంద్రబాబుకు సంజయ్ గాంధీతో సాన్నిహిత్యం పెరిగింది.

యువకులకు 20 శాతం సీట్లు ఇవ్వాలనే నిర్ణయం చంద్రబాబుకు కలిసి వచ్చింది. 1978లో ఆయన చంద్రగిరి నుంచి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక, సినిమాటోఫీగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావుతో సంబంధాలు పెరిగాయి. ఆ తర్వాత ఎన్టీ రామారావు రెండో కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ ఆయన కాంగ్రెసులోనే ఉండిపోయారు. 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.
ఎన్టీ రామారావు స్థాపించిన టిడిపిలో కెసిఆర్ వెంటనే చేరారు. టిడిపి అభ్యర్థిగా 1983లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి మదన్మోహన్పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సిద్ధిపేట నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆయన పనిచేశారు.

అధికారం ఎన్టీ రామారావు చేతుల నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా శఆఖ మంత్రిగా కెసిఆర్ పనిచేశారు. 2000ల్లో చంద్రబాబు ప్రభుత్వంలోనే డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారు.
ఆ సమయంలో చంద్రబాబుకు, కెసిఆర్కు మధ్య విభేదాలు వచ్చాయి. నిజానికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో జన్మభూమి వంటి కీలకమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసింది కెసిఆరేనని చెబుతారు. చంద్రబాబు ఎన్టీఆర్ చేతుల మీదుగా అమలు చేయించడానికి చురుగ్గా వ్యవహరించే వారని అంటారు.
ఆ తర్వాత కెసిఆర్ టిడిపి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ను ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించి, సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకు సమాంతరంగా ఆయన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమంలో కెసిఆర్ చంద్రబాబునే ప్రధాన రాజకీయ శత్రువుగా పరిగణించారు. తెలంగాణలో టిడిపికి బలమైన పునాది ఉండడం అందుకు కారణం కావచ్చు. టిడిపి పునాదులు పెకిలిస్తే తప్ప టిఆర్ఎస్ ముందుకు సాగదనే ఉద్దేశంతోనే ఆయన అలా వ్యవహరించి ఉంటారని అనుకుంటున్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబు వైఖరే అందుకు కారణమని కెసిఆర్ అనుకూల వర్గాలు అంటాయి. గత ఎన్నికల్లో కెసిఆర్ టిడిపినే కాదు, కాంగ్రెసును కూడా తెలంగాణ మట్టి కరిపించారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం వల్ల అసంతృప్తికి గురై కెసిఆర్ చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి బయటకు వచ్చారని అంటారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కెసిఆర్ టిఆర్ఎస్ను స్థాపించారనే పద్ధతిలో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు కూడా. అయితే, ఒక కులానికి చెందిన కోటగిరి విద్యాధర రావు (ఆంధ్ర), విజయ రామారావు (తెలంగాణ)లకు మంత్రి పదవులు ఇవ్వాల్సి రావడంతో అదే కులానికి చెందిన కెసిఆర్కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదని టిడిపి వర్గాలంటాయి.
కెసిఆర్ టిడిపి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రధానాస్త్రంగా చేసుకుని ఆయన తన పార్టీ ద్వారా విమర్శలు చేస్తూ వచ్చారు. కెసిఆర్ చేసే విమర్శలను చంద్రబాబు, ఇతర టిడిపి నాయకులు వ్యక్తిగతమైనవిగా భావిస్తూ వచ్చారు కూడా. కానీ, తెలంగాణ ప్రజలు కెసిఆర్ విమర్శలను పట్టించుకున్నారు. మాటకారిగా పేరున్న కెసిఆర్ అనతి కాలంలోనే తెలంగాణ ప్రజల మనస్సులు దోచుకున్నారు. అనూహ్యమైన రీతిలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్తో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి పొత్తు పెట్టుకుంది. అయితే, కూటమి ఓటమి పాలైంది. టిఆర్ఎస్ చాలా తక్కువ సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంది. టిడిపికి ప్రతిపక్ష హోదానే దక్కింది. సీట్ల పంపకంలో హేతుబద్ధత లోపించడం వల్లనే అలా జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ చంద్రబాబు మాత్రం కెసిఆర్పైనే నిందలు వేస్తూ వచ్చారు.
దాదాపు 9 ఏళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు నాయుడు బలమైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కుని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కెసిఆర్, చంద్రబాబు చెరో రాష్టానికి ముఖ్యమంత్రులు అయినప్పటికీ రాజకీయ వైరం మాసిపోలేదు. ఆ రాజకీయ వైరం కారణంగానే ఇరువురి మధ్య అప్పుడప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది.












Click it and Unblock the Notifications