కొత్త సీఎం ఎవరంటే.. తేల్చేసిన అగ్రనాయకత్వం
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమని తేలిపోయింది. ముఖ్యంగా పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన ఎల్డీఎఫ్ (LDF) సర్కార్ను గద్దె దించి, 100 స్థానాల దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ శిబిరంలో ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ మొదలైంది. ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ ఫేస్, ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.
కేరళ ప్రజలు పినరయి విజయన్ ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక విధానాలను" తిప్పికొట్టారని, మార్పును ఆకాంక్షించారని శశిథరూర్ విశ్లేషించారు. 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 99 చోట్ల ముందంజలో ఉండటంతో.. "ముఖ్యమంత్రి ఎవరూ?" అన్న ప్రశ్నపై థరూర్ స్పందించారు. "ప్రస్తుతం మా దగ్గర సరైన నాయకత్వానికి తగినంత మంది పోటీదారులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ విధానం ప్రకారం, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక ప్రతినిధిని పంపి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారు. ఆపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

విజయన్కే షాక్.. ధర్మదంలో వెనుకంజ!
కేరళ రాజకీయ చరిత్రలో పెను సంచలనం ఏమిటంటే.. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గం 'ధర్మదం'లో వెనుకంజలో ఉండటం. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ అక్కడ గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలోకి వెళ్లారు. "పదేళ్ల చెత్త రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికారు. ఇది కేవలం విజయం కాదు, కొత్త రకమైన రాజకీయాలకు ఆరంభం" అని థరూర్ వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు..
ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో యూడీఎఫ్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాలు కూడా మంచి సీట్లు సాధించడంతో కాంగ్రెస్ కూటమి బలం 100కు చేరువయ్యింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ఎంపీ జెబి మథర్ ఈ విజయాన్ని కేరళ ప్రజల గెలుపుగా అభివర్ణించారు. కాంగ్రెస్ 50 చోట్ల, ముస్లిం లీగ్ 17 చోట్ల సొంతంగా లీడ్లో ఉన్నాయి.
మొత్తానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం ఎన్నికలతో పాటు కేరళ ఫలితాలు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా కేరళలో నాయకత్వ మార్పు ద్వారా యువతకు, కొత్త ఆలోచనలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు థరూర్ మాటలను బట్టి అర్థమవుతోంది.














Click it and Unblock the Notifications