ఒక్క రోజైనా నాతో గడుపు: వైద్యురాలిని నీచంగా వేధించాడు
భర్త నుంచి విడాకులు తీసుకున్న వైద్యురాలికి ఓ దుండగుడి నుంచి ఘోరమైన అనుభవం ఎదురైంది.
బెంగళూరు: భర్త నుంచి విడాకులు తీసుకున్న వైద్యురాలికి ఓ దుండగుడి నుంచి ఘోరమైన అనుభవం ఎదురైంది. విడాకులు తీసుకున్న ఆమె.. తన తల్లిదండ్రుల కోరిక మేరకు మరో వివాహం చేసుకుందామని అనుకుంది. ఓ మాట్రిమోనీలో తన ప్రొఫైల్ ఇచ్చింది. కాగా, ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పెళ్లాడతానని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె అతడ్ని నిరాకరించింది. అయినా వదలని ఆ దుర్మార్గుడు ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు.
బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ మహిళ ఆసుపత్రిలో డెంటిస్ట్గా పనిచేస్తోంది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం విడిపోయిన ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. ఆమెకు పిల్లలు లేరు. దీంతో మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలని తల్లిదండ్రులు ఆమెకు సూచించారు.
ఈ క్రమంలో ఓ మ్యాట్రిమొనియల్ వెబ్సైట్లో మహిళ తన ఫోటోతో పాటు వివరాలు ఉంచింది. ఆ వివరాలు చూసిన సంజీవ్ అనే వ్యక్తి ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయం చెబుతానని మహిళ చెప్పింది. అతని ప్రొఫైల్ పరిశీలించిన కుటుంబ సభ్యులు సరిజోడి కాదని తేల్చేశారు.

సదరు మహిళ కూడా సంజీవ్కు ఈ విషయం చెప్పింది. సంజీవ్ కనీసం ఫ్రెండ్స్గానైనా ఉందాం అంటూ మహిళపై ఒత్తిడి చేశాడు. దీంతో అసలు ఉద్దేశమేంటని సంజీవ్ను మహిళ ప్రశ్నించింది. పెళ్లి ఎలాగో చేసుకోవడం లేదు కదా కనీసం ఒక్క రోజైనా తనతో గడపాలని సంజీవ్ నీచంగా మాట్లాడాడు.
దీంతో సంజీవ్ను హెచ్చరించి, మళ్లీ ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మహిళ చెప్పింది. అయినా.. సంజీవ్ ఆమె మాటను పట్టించుకోకుండా పదేపదే ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా సదరు మహిళ ఫోటోను జతచేసి, శృంగారంపై ఆసక్తి ఉన్న మగవారు ఈమెను సంప్రదించడంటూ నెట్లో ఆమె వివరాలతో కూడిన ఓ యాడ్ పెట్టాడు.
ఈ నేపథ్యంలో ఆమెకు దాదాపు వందల మంది ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు.. దీనంతటికి కారణంగా సంజీవ్ అని తేల్చారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నిందితుడ్ని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications