వారణాసి నుంచి ప్రధాని మోడీ హ్యాట్రిక్: షాకిచ్చేలా ప్రత్యర్థి దూకుడు
వారణాసి: లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానం నుంచి హ్యట్రిక్ విజయం నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, మోడీపై అజయ్ రాయ్ పోటీ చేయడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం.2014లో నరేంద్ర మోడీ తొలిసారి ఇక్కడ పోటీ చేయగా.. 56 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ రాయ్కు కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
ఇక, 2019 ఎన్నికల్లో ప్రధాని మోడీకి 63 శాతం ఓట్లు రాగా, అజయ్రాయ్కి 14 శాతం ఓట్లు దక్కాయి.అయితే, క్రమంగా అజయ్ రాయ్ కూడా తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం గమనార్హం. అంతేగాక, నేడు విడుదలైన ఫలితాల్లో ఒకటి రెండు రౌండ్లు మోడీపై అజయ్ రాయ్ పైచేయి కూడా సాధించారు. అయితే, అన్ని రౌండ్లు ముగిసేవరకు ప్రధాని మోడీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించారు. దీంతో ప్రధాని మోడీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా విజయాన్ని నమోదు చేశారు.

ఈసారి ప్రధానమంత్రి మోడీ 6,12,970 ఓట్లతో (54.24%) గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయ్కి 4,60,457 ఓట్లు (40.74%) రావడం విశేషం. ప్రధానమంత్రి మోడీ హ్యాట్రిక్ సాధించగలిగినప్పటికీ.. ఆయన ఓట్ షేర్ దాదాపు 9 శాతం పాయింట్లు తగ్గడం చర్చనీయంశంగా మారింది. అయితే, ఇండి కూటమిలో భాగంగా ఈ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి అభ్యర్థి పోటీలో లేకపోవడం కూడా రాయ్కి కలిసివచ్చినట్లు తెలుస్తోంది.
అమిత్ షా భారీ విజయం
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుంచి కేంద్రమంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ సోనాల్ రమణ్భాయ్పై 7.4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, 1991 ఎన్నికల్లో అద్వానీ ఈ స్థానం నుంచే గెలిచారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అటల్ బిహారీ వాజ్పేయీ బరిలోకి దిగి ఘన విజయం సాధించారు.
1996లోనే జరిగి ఉప ఎన్నికల్లో విజయ్భాయ్ పటేల్ గెలిచారు. అనంతరం 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎల్కే అద్వానీ వరుసగా విజయం సాధించి బీజేపీకి కంచుకోటగా మార్చారు. అద్వానీ ఆరోగ్య కారణాలతో వల్ల ఆయన పోటీ చేయకపోవడంతో.. 2019లో ఈ స్థానంలో బరిలోకి దిగిన అమిత్ షా 69.67 శాతం ఓట్లతో గెలుపొందారు. కాగా, దేశంలో లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాల్లో ఎన్డీఏ 293 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇండి కూటమి 232 సీట్లలో ఆధిక్యంలో ఉంది.












Click it and Unblock the Notifications