మహారాష్ట్ర అన్లాక్: పాజిటివిటీ రేటు ఆధారంగా ఐదు కేటగిరీల్లో, సోమవారం నుంచి అమలు
ముంబై: మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియను ప్రారంభించింది. సెకండ్ వేవ్లో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలతో రాష్ట్రంలో క్రమంగా కరోనా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు దశల్లో అన్లాక్ ప్రక్రియను చేపట్టింది.
వైద్యశాఖ, హోంశాఖలతో చర్చించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేటగిరీలుగా విభజించి అన్లాక్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఆధారంగా ప్రాంతాలు, ఆస్పత్రులలో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ తదితర అంశాలను ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు తెలిపింది.
ముందుగా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండి.. ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 25 శాతం ఉన్న ప్రాంతాల్లో రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్లు వంటి వాటికి అనుమతులు ఇవ్వడంతోపాటు ప్రజా రవాణాను యధావిధిగా పునరుద్ధరించుకునేందుకు వెసులుబాటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇవన్నీ మొదటి దశలో అమలు కానున్నాయి.
ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్స్ 25-40 శాతంగా ఉన్న ప్రాంతాలను రెండో కేటగిరీగా విభజించి లాక్డౌన్ నిబంధనలను సడలించి, 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇక మిగితా మూడు కేటగిరీల్లో కూడా ఆయా ప్రాంతాల్లో కరోనా పాజిటివిటీ రేటు, ఆరోగ్య వసతులను బట్టి వెసులుబాటు ఇవ్వాలా? లేక మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు.
కొత్త మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మొదట అన్ని ప్రాంతాల్లో పూర్తిగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో సడలింపులిస్తే.. మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఐదు కేటగిరీల మార్గాన్ని ఎంచుకున్నారు. కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో 14వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 58లక్షలు దాటింది. కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షల దిగువకు వచ్చాయి.