కలాం ఫోటోకు దండ, హారతి ఇచ్చిన మంత్రి
రాంచి: ఆమె ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. బ్రతికున్న మనిషి ఫోటోకు దండ వేసి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేశారు. ఈ తతంగం ఒక పాఠశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు, మీడియా ఈ సంఘటనతో షాక్కు గురయ్యారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి కుంకమ పెట్టి హారతి ఇచ్చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ ఈ తతంగం మొత్తం చేశారు. జార్ఖండ్ లోని కోదర్మ జిల్లా లోని ఒక పాఠశాలలో స్మార్ట్ క్లాసుల ప్రారంభించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్, బీజేపీ శాసన సభ్యుడు మనీష్ జైశ్వాల్, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఆ సందర్బంలో నీరా యాదవ్ అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేశారు. ఆమె స్వయంగా ఫోటోకు తిలకం దిద్దారు. తరువాత కర్పూర హారతి ఇచ్చారు.
ఫోటో ముందు కొబ్బరికాయ పెట్టారు. ఈ సంఘటనతో స్థానికులు షాక్ కు గురైనారు. తరువాత విషయం తెలుసుకున్న నీరా యాదవ్ మొదట నాలుక్కర్చుకున్నారు. తరువాత మీడియా ముందు ఆమె తను చేసిన పనిని సమర్థించుకున్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త అన్నారు. ఆయన ఫోటోకు దండ వేయడం తప్పుకాదని, నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అలా చేశానని సమర్ధించుకున్నారు. మంత్రిగారి చేసిన పనికి స్థానిక శాసన సభ్యుడు మనీష్ జైశ్వాల్ వత్తాసు పలికారు. అయితే సోషల్ మీడియాలో మంత్రి గారి మీద పలువురు మండిపడ్డారు.