నగ్న చిత్రాలతో వేధించారు: రాజస్థాన్లో ఎనిమిదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్
గంగేశ్వర్ అగ్రీ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లా నీమ్ కా థానా గ్రామానికి చెందిన బాలిక(15)పై సామూహిక అత్యాచారం జరిగింది. గంగేశ్వర్ అగ్రీ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై బాధిత బాలిక తరుపున బుధవారం సదర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరు గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నారని, తన నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఘటన విషయానికొస్తే.. మంగళవారం నాడు తన తండ్రికి మందులు తీసుకోవడం కోసం గంగేశ్వర్ అగ్రీ గ్రామంలోని మెడికల్ షాపుకు బాలిక వెళ్లింది. కాసేపటికి అక్కడికి వచ్చిన మహేంద్ర సింగి, రాజ్ బాలికను బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారు. ఆరోజు రాత్రి ఆలస్యంగా ఇంటికెళ్లిన బాలిక తల్లిదండ్రులకు తన మీద జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది.
ఆ మరుసటి రోజు తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరు తనను ప్రతీరోజు వెంబడిస్తున్నారని, స్కూల్ కు వెళ్లే సమయంలో అడ్డుపడి నానా దుర్భాషాలాడుతున్నారని తెలిపింది. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసుల వేట కొనసాగుతోంది.