మమతకు కేంద్రం భారీ షాకులు-మేనల్లుడికి ఈడీ సమన్లు-ఎన్నికల హింసపై 10 ఎఫ్ఐఆర్ లు
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సీఎం మమతా బెనర్జీని వరుసగా టార్గెట్ చేస్తున్న కేంద్రం.. ఇవాళ రెండు భారీ షాకులిచ్చింది. ఇందులో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లకు జారీ చేయడం ఒకటి కాగా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై సీబీఐ మరో 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం రెండవది.
బెంగాల్లోని గనుల నుంచి బొగ్గును అక్రమంగా ఎగుమతి చేయడం ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడిన కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య రుజిరా బెనర్జీని కూడా విచారణకు హాజరుకావాలని ఇావాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 1న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో ఈడీ కోరింది. అయితే సెప్టెంబర్ 3లోపు హాజరు కావాలని ఈడీ కోరినట్లు అభిషేక్ బెనర్జీ లాయర్ తెలిపారు. ఇదే కేసులో బెంగాల్ కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శ్యామ్ సింగ్, జ్ఞాన్ వంత్ సింగ్ లను సైతం సెప్టెంబర్ 7,8 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపింది.

మరోవైపు పశ్చిమబెంగాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై వరుసగా కేసులు నమోదు చేస్తున్న సీబీఐ .. ఇవాళ మరో 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. ఎన్నికల హింస సందర్భంగా తృణూల్ కార్యకర్తలను నిందితులుగా చేరుస్తూ ఈ ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐర్ ల సంఖ్య 21కు చేరుకుంది. ఎన్నికల తర్వాత హింస కేసుల్లో ఇద్దరు తృణమూల్ కార్యకర్తల్ని తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసలో బాధితులుగా మారిన వారి కుటుంబాల నుంచి వాంగ్మూలాలను కూడా సీబీఐ రికార్డు చేస్తోంది. వీటి ఆధారంగా ఎఫ్ఐఆర్ లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీబీఐ, ఈడీ దూకుడుపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు కేంద్రం ఎన్ని కక్షసాధింపులకు దిగినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. తనకు ఈడీ పంపిన సమన్లపై ఎలాంటి ఆందోళనకూ గురి కావడం లేదని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా వెల్లడించారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.












Click it and Unblock the Notifications