యువత రక్తం మరుగుతోంది: కాంగ్రెస్, అఖిలేష్పై మోడీ
కాన్పూర్: కాంగ్రెసు పేరు వింటేనే యువతకు రక్తం మరుగుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఉత్తర ప్రదేశ్లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన కాన్పూర్లో జరిగిన సభలో యూపిఏ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ధరల పెరుగుదల పైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లు ఎప్పుడు మాట్లాడలేదన్నారు.
వంద రోజుల్లో ద్రవ్యోల్భణం అదుపు చేస్తామని చేయలేకపోయారన్నారు. దేశ ప్రజల బతుకులు దిగజార్చడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనన్నారు. కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు కోపంగా ఉన్నారని, ఆ పార్టీని, యూపిఏను శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధిక ధరల ఊసెత్తకుండా యూపిఏ తలబిరుస్తో ప్రవర్తిస్తోందన్నారు. ధరలు తగ్గించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

అరవయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేస్తూనే ఉందన్నారు. కాంగ్రెసు పార్టీతో ఉన్నందుకు యూపిఏ పక్షాలు సిగ్గుపడుతున్నాయన్నారు. తరుచూ పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ కేంద్రం ఏం చేయలేకపోతోందన్నారు. బొగ్గు ఫైళ్లు అదృశ్యమయ్యాయని ఢిల్లీ పెద్దలు చెబుతుంటే.. తాను మాత్రం అసలు ప్రభుత్వమే అదృశ్యమైందంటున్నానని ఎద్దేవా చేశారు.ఆహార భద్రత బిల్లు వంటి వాటితో ప్రజలను యూపిఏ ఫూల్ చేస్తోందన్నారు.
అఖిలేష్ ప్రభుత్వం పైన నిప్పులు
అఖిలేష్ ఏడాది పాలనలో వేలమంది హత్యగావింప పడ్డారని ఆరోపించారు. యూపిలో ఉపాధి దొరకక గుజరాత్కు వస్తున్న వారు ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు, బిఎస్పీ, ఎస్పీలు నాశనం చేశాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాద కేసుల్లో ఉన్న వారిని ఎస్పీ ప్రభుత్వ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, కల్యాణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications