HCU: రణరంగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థుల అరెస్ట్: వందమందికి పైగా.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమించారు. మహా ప్రదర్శనను నిర్వహించడానికి ప్రయత్నించారు. కొద్దిరోజులుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపడుతోన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అండగా నిలిచారు. నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభకు ముందే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేశారు.

ఓయూ, ఐఎస్బీ విద్యార్థులతో కలిసి..
ఉస్మానియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) విద్యార్థులతో కలిసి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వారి ప్రయత్నాలను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. జంటనగరాల్లో 144 సెక్షన్ ను విధించినందు వల్ల ఎలాంటి బహిరంగ సభలకు గానీ, నిరసన ప్రదర్శనలకు గానీ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేసి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకం..
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులంతా వ్యతిరేకిస్తున్నారని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులందరూ ఉద్యమిస్తున్నప్పటికీ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వారి వైఖరేంటీ?
ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీ వంటి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థల విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి, తమ నిరసలను వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా తమ పౌరసత్వ సవరణ చట్టం అమలుపై తమ వైఖరి ఏమిటనేది స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఒకవంక దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ.. చూస్తూ కాలక్షేపం చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో చట్టం అమలవుతుందా?
పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము అమలు చేయబోమంటూ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేశాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన మౌనాన్ని వీడాలని, అమలు చేస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలని నినదించారు.

మొయినాబాద్ కు తరలింపు..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అదుపులోకి తీసుకున్న విద్యార్థులందరినీ పోలీసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రత్యేక వాహనాల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా విద్యార్థులు తమ నిరసన ప్రదర్శనలను కొనసాగించారు. పలువురు విద్యార్థులు డప్పు కొడుతూ, పాటలు పాడుతూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు.












Click it and Unblock the Notifications