గంటన్నరపాటు ప్రీతి స్టేట్మెంట్ రికార్డ్, ఏం చెప్పారు?
ముంబై: బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా స్టేట్మెంట్ను మంగళవారం విచారణ అధికారులు తీసుకున్నారు. తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను ఎక్కడైతే వేధించాడని ప్రీతిజింతా చెబుతున్నారో.. అక్కడే (వాంఖేడే స్టేడియం) పోలీసులు ఆమె స్టేట్మెంట్ను తీసుకున్నారు.
వాంఖేడే స్టేడియంలో ప్రీతిజింతా తనకు నెస్ వాడియా నుండి ఎదురైన పరాభవం పూసగుచ్చినట్లుగా చెప్పారని సమాచారం. ప్రీతి 12 నుండి 14 మంది సాక్ష్యులను పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విచారణాధికారులు వారి స్టేట్మెంట్ కూడా త్వరలో తీసుకోనున్నారు.
తనను నెస్ వాడియా వేధించిన మూడు ప్రదేశాలను ఆమె చూపించారు. తనను వేధించినప్పుడు నెస్ స్నేహితులు కూడా కొందరు ఆయన వెంట ఉన్నట్లు చెప్పారని సమాచారం. ఓ జట్టు సభ్యుడి బంధువు (ఆస్ట్రేలియా వ్యక్తి) నెస్ వాడియాను వారించారని చెప్పారు.
తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రీతిజింతా చెప్పిందని పోలీసులు తెలిపారు. సాక్ష్యుల పేర్లు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అనంతరం విచారణకు సహకరించాలని నెస్ వాడియా తరఫు న్యాయవాదికి పోలీసులు సూచించారు.
కాగా, స్టేట్మెంట్ రికార్డ్ కోసం ప్రీతిజింతా తన న్యాయవాదితో కలిసి ఆరు గంటల నలభై నిమిషాలకు వాంఖేడే స్టేడియానికి వచ్చారు. ఇందుకోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆమె స్టేట్మెంట్ను మరైన్ డ్రైవ్ పోలీసులు రికార్డ్ చేశారు. గంటన్నర పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.