ఐనా నేను ఒక్కడినే: మురళీ మోహన్, మతమార్పిళ్లపై కొత్తచట్టం..
న్యూఢిల్లీ: లోకసభలో గురువారం నాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మతమార్పిడుల పైన లోకసభలో చర్చ జరిగిన సమయంలో ఆయన మాట్లాడారు. తన పేరు మురళీ మోహన్ అని, తనను ఒక్కొక్కరు ఒక్కో రంగా పిలుస్తారని, అయనప్పటికీ తాను ఒక్కడినేనని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ.. 'నా పేరు మురళీ మోహన్. నాన్న నన్ను బాబూ అంటారు. భార్య ఏవండీ అంటుంది. కుమారుడు నాన్న అంటాడు. మనవరాలు తాత అంటుంది. తమ్ముడు అన్నయ్య అంటాడు. బావమరిది బావ అని పిలుస్తాడు. ఎవరు ఎలా పిలిచినా నేను ఒక్కడినే.
నాకు వంద రూపాలు లేవు. అలాగే రాముడు అన్నా, అల్లా అన్నా, జీసస్ అన్నా దేవుడు ఒక్కడే. ఇలాంటి సున్నితమైన అంశాల పైన చర్చలు అనవసరం. దేవుడికి కులాలు, మతాలు లేవు. దేశాభివృద్ధి గురించి ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిద'ని ఆయన లోకసభలో వ్యాఖ్యానించారు.

వెంకయ్య నాయుడు మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాల్లో మతమార్పిడుల నిరోధక చట్టాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపాదించారు. కొన్ని మత సంస్థలు విదేశాల నుండి వస్తున్న నిధుల సహాయంతో దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్నాయన్నారు.
దళితులు, వెనకబడిన కులాలు, పేదలు, గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నాయన్నారు. మత స్వేచ్ఛకు అర్థం మతాన్ని మార్చటం కాదని, మతమార్పిడులను తమ ప్రభుత్వం కొనసాగనివ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం డిమాండ్ మేరకు మతమార్పిడులపై లోకసభలో గురువారం జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. మతమార్పిడుల నిరోధానికి కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్రం చెప్పింది.
ఖాప్ పంచాయతీలపై సదానంద
ఖాప్ పంచాయతీ తరహా సంప్రదాయ న్యాయవ్యవస్థలు చట్టవిరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. అటువంటి వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాలని కేంద్ర న్యాయ మంత్రి డీవీ సదానంద గౌడ లోకసభలో గురువారం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రవీంద్రకుమార్ జెనా(బీజేడీ) అడిగిన అనుబంధ ప్రశ్నకు సదానంద బదులిచ్చారు.
మహిళలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ జరిగేలా త్వరలో మహిళా కోర్టులను ఆరంభించాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాస్తానని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందజేసే వ్యవస్థ ఏర్పాటు నిమిత్తం రాష్ట్రాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications