రేపు మహారాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన అధికార కూటమి: పండగవేళంటూ వ్యాపారవర్గాల ఆవేదన
ముంబై: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు నిరసనగా సోమవారం(అక్టోబర్ 11న) రాష్ట్రవ్యాప్తంగా బంద్కు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది. రైతులకు మద్దతుగా బంద్ పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆస్పత్రులు లాంటి అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేసి ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ప్రకటనపై ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ) ప్రతికూలంగా స్పందించింది.
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన సంఘటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కానీ, బంద్కు మాత్రం తాము మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తితో విధించిన లాక్డౌన్ వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా పుంజుకొంటున్నాయి. పండగల సీజన్ కావడంతో ప్రజలు షాపింగ్ చేయడానికి వస్తారు. మా వ్యాపారాలను ప్రశాంతంగా చేసుకోనివ్వండి. రిటైల్ దుకాణాలను తెరిచి ఉంచేలా అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా దుకాణాలను బలవంతంగా మూసివేయవద్దని కోరుతున్నామని ట్రేడర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం రాత్రి ఆశిష్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో రాత్రే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అంతకుముందు ఆయనకు క్రైం బ్రాంచ్ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ యాదవ్ తెలిపారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. రైతుల మృతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు.
Recommended Video
మరోవైపు, లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్నాథ్ రామ్ నాథ్ కోవింద్కు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్కు తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు.












Click it and Unblock the Notifications