నోట్ల రద్దు: మోడీ ప్రభుత్వానికి నందన్ నీలేకని సహకారం
సురక్షితంగా నగదు చెల్లింపులు జరిపేలా పలు విధానాలపై.. ఆధార్ వ్యవస్థ రూపకర్త నందన్ నీలేకని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సహకారం అందించనున్నారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు క్యాష్ లెస్ భారత్ కోసం మోడీ ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించడమే లక్ష్యంగా కృషి జరుగుతోంది.
ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ల ద్వారా సురక్షితంగా నగదు చెల్లింపులు జరిపేలా పలు విధానాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో తెచ్చిన ఆధార్ వ్యవస్థ రూపకర్త నందన్ నీలేకని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సహకారం అందించనున్నారు.

ఇందులో భాగంగా యూఎస్ఎస్డీ విధానంతో స్మార్ట్ ఫోన్స్ ద్వారా చేసే చెల్లింపుల విధానాన్ని మరింత సులువు చేసేలా సూచనలు అందిస్తారు. ప్రధానంగా ఫీచర్ ఫోన్స్లో డిజిటల్ పేమెంట్ వ్యవస్థని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసే విధానంలో ఆయన సలహాలివ్వనున్నారని తెలుస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కూడా సహకరించనుంది.
కాగా, దాదాపు రెండు వారాల క్రితం నందన్ నీలేకని నోట్ల రద్దును సమర్థించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు అంశం భారత దేశానికి మంచిదని ఆయన అన్నారు. భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications