'అతని'పై దృష్టిసారించిన నరేంద్రమోడీ, అమిత్ షా
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మరో అగ్రనేత రాహుల్ గాంధీని విచారించిన సంగతి తెలిసిందే. 50 గంటలకు పైగా రాహుల్ ను అధికారులు విచారించడంతోపాటు వందల సంఖ్యలో ప్రశ్నల వర్షం కురిపించారు. కొవిడ్ తగ్గిన తర్వాత సోనియాగాంధీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆమెపై 100 ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా నిరసనలు
ఈ రెండు సంఘటనలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటివరకు కాంగ్రెస్ లో అసమ్మతి నేతలుగా ఉన్నవారంతా కలసికట్టుగా ఎన్డీయేపై నిరసన గళం వినిపించారు. యుద్ధం చేసే సమయంలో రాజులు కూడా స్త్రీల జోలికి వెళ్లవద్దంటూ సైనికులకు చెప్పేవారని, కనీసం ఆ నీతిని కూడా ఈడీ పాటించడంలేదంటూ గులాంనబీ ఆజాద్ పేరు ఎత్తకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యంగ్ ఇండియా కార్యాలయానికి సీల్
తదనంతర పరిణామాల్లో అధికారులు హెరాల్డ్ కు సంబంధించి యంగ్ ఇండియా కార్యాలయానికి సీల్ వేశారు. తర్వాత కేంద్రం దృష్టి కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గేపై పడింది. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో తనకు ఈడీ అధికారులు సమన్లు జారీచేయడంపై ఆయన రాజ్యసభలోనే మండిపడ్డారు.
తమ గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇలాగైతే ప్రజాస్వామ్యం బతుకుతుందా? అంటూ విమర్శించారు. ఈడీ విధుల్లో తాము జోక్యం చేసుకోలేదంటూ మంత్రి పీయూష్ గోయల్ ఖర్గేకు బదులిచ్చారు. దర్యాప్తు సంస్థల విధుల్లో తాము జోక్యం చేసుకోమని, బహుశా వారు అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారేమోనంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. పార్లమెంటులో చర్చ ముగిసిన తర్వాత ఖర్గే ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే వ్యూహంలో భాగంగానే అదే రాష్ట్రానికి చెంది ఖర్గేకు సమన్లు జారీచేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని, అందుకు నేతలు ఎన్నికలకు సన్నద్ధం కాలేని స్థితిని కల్పించాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.
ఖర్గేకు సమన్లు జారీచేయడంద్వారా బీజేపీ ఎంతవరకు తన లక్ష్యాన్ని చేరుకుంటుందనే విషయమై ఆ పార్టీ నేతల్లోను స్పష్టత లేదు. భవిష్యత్తులో చోటుచేసుకోబోయే పరిణామాలే వీటికి సమాధానం చెబుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.