రజనీకాంత్ కోసం ఉద్యమమే చేస్తున్నారు.. తలైవర్ ఇప్పుడైనా ఓకె చెబుతాడా?
'ప్రజలు జీవించాలంటే నువ్వు పాలించాలి. ఈ భూమి మిమ్మల్నే నమ్ముకుంది. ప్రజలకు ఒక మంచి దారి చూపించండి' అన్న నినాదంతో అభిమానులు పోస్టర్లను అతికించారు.
చెన్నై: ఒక్క మాటతో తమిళ రాజకీయాలను శాసించగల సత్తా ఉన్న రజనీకాంత్.. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరం అనే సంకేతాలు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. అయినా అభిమానుల్లో మాత్రం ఆశ చావట్లేదు. ఎలాగైనా ఆయన్ను పాలిటిక్స్ లోకి దింపాలని.. ఒకరకంగా 'పోస్టర్ల' ఉద్యమమే చేస్తున్నారు.
తలైవర్ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిసిన సందర్భాలు ఇప్పటికి అనేకం. ఇప్పుడదే జాబితాలో మరో ప్రయత్నం. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ మరోసారి పోస్టర్ల ద్వారా ఆయన అభిమానులు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. చెన్నై నగరంలో భారీ ఎత్తున ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
'ప్రజలు జీవించాలంటే నువ్వు పాలించాలి. ఈ భూమి మిమ్మల్నే నమ్ముకుంది. ప్రజలకు ఒక మంచి దారి చూపించండి' అన్న నినాదంతో అభిమానులు పోస్టర్లను అతికించారు. రజనీకాంత్ నివాసముండే పోయెస్ గార్డెన్ సమీపంలోని రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్ వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
అభిమానుల ప్రయత్నాల సంగతెలా ఉన్నా.. రజనీ మాత్రం రాజకీయాల పట్ల తన ఆలోచన మార్చుకునే ఉద్దేశంలో లేనట్టే కనిపిస్తోంది. ఎన్నిసార్లు రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చినా.. ఆయన నోటి వెంట అందుకు ప్రతికూల సంకేతాలే వెలువడుతున్నాయి. మరి తాజా పోస్టర్లపై రజనీ మరోసారి స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.
కాగా, ఇంతకుముందు బీజేపీ సైతం రజనీకాంత్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ యథావిధిగా రజనీ మాత్రం అందుకు నో చెప్పేశారు. దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ.. రజనీని తమవైపుకు తిప్పుకోగలిగితే.. తమిళనాడు ఇక తమదే అని భావించింది. కానీ రజనీ మాత్రం ససేమిరా అనడంతో.. ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు.