దేశవ్యాప్తంగా గ్యాంగ్ స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ- ఏకకాలంలో 60 చోట్ల దాడులు
దేశవ్యాప్తంగా గ్యాంగుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు విచ్చిలవిడిగా చెలరేగిపోతున్నారు. తాజాగా పంజాబ్ లో సింగర్ సిద్దూ మూసేవాలాను ఏకంగా రష్యన్ మేడ్ ఆయుధంతో కాల్చిచంపేశారు. దీని వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఏకకాలంలో దర్యాప్తు సాగిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మిగతా గ్యాంగులు కూడా రెచ్చిపోతున్నాయి. వీటి వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్ఐఏ అధికారులు గ్యాంగ్ స్టర్లపై విరుచుకుపడుతున్నారు.
ముఠాలు, క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) ఇవాళ దేశవ్యాప్తంగా 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. 60 స్థానాల్లో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, బాంబిహా గ్యాంగ్, నీరజ్ బవానా గ్యాంగ్లకు చెందిన 10 మంది గ్యాంగ్స్టర్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఎన్ఐఎ విచారణ చేపట్టింది.

సిద్ధూ మూసే వాలా హత్య కేసులో అరెస్టయిన గ్యాంగ్స్టర్లకు తీవ్రవాద గ్రూపులకు మధ్య బలమైన సంబంధం ఉందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పిన మరుసటి రోజే ఎన్ఐఏ ఈ దాడులు చేపట్టడం విశేషం. ఈ గ్యాంగుల మధ్య సంబంధాల్ని ఐఎస్ఐ వాడుకుంటోందని ఆయన అన్నారు.ఎన్ఐఏ నివేదిక ప్రకారం నీరజ్ సెహ్రావత్ అలియాస్ నీరజ్ బవానా, అతని గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం, సోషల్ మీడియాలో భీభత్సాన్ని వ్యాప్తి చేయడంలో పాల్గొంటున్నారు. అలాగే నీరజ్ బవానా, అతని గ్యాంగ్ ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్తో గ్యాంగ్ వార్లో పాల్గొంటున్నారు. పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూస్ వాలా హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత నీరజ్ బవానా మూసేవాలా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై దాడులు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications