ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాపోర్టులో ఇటీవల పట్టుబడిన రూ. 21వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్లో పట్టుబడిన నార్కోటిక్స్ కేసు విచారణ ఎన్ఏఐకు బదిలీ అయ్యింది. కేంద్రం హోంశాఖ.. ఎన్ఏఐ దర్యాప్తు కొనసాగించేందుకు బుధవారం ఆమోదముద్ర వేసింది.
ఇప్పటికే డీఆర్ఐ నుంచి ఎన్ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుంది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. కాగా, సెప్టెంబర్ 15న ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాధవరం సుధాకర్గా గుర్తించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ వ్యవహారంలో సూత్రధారి మాత్రం డ్రగ్స్ మాఫియాలో కింగ్పిన్ ఢిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ డ్రగ్స్ ను ఢిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహంగా గుర్తించాయి. నిఘా దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి, దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు తేల్చాయి.
Recommended Video
ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్ ఇందులో పాత్రధారిగా ఉన్నాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి.. దాన్ని డ్రగ్స్ సరఫరా ముఠాలకు అందించాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఏడాది జూన్ నెలలో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్ ముసుగులో సుమారు 25 టన్నుల హెరాయిన్ ఆప్ఘానిస్థాన్ నుంచి దిగుమతి అయ్యిందని, అది కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి. ఈ డ్రగ్స్ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి, మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎన్ఐఏ దర్యాప్తునకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.