ఆ సీఎం ఆస్తి.. ఆయన కొడుకు కన్నా తక్కువ!
ఆశ్చర్యంగా.. కొడుకు కన్నా సీఎం నితీష్ కుమార్ తక్కువ ఆస్తులను కలిగి ఉండటం గమనార్హం.
పాట్నా: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్బంగా బీహార్ సీఎం నితీష్ సహా కేబినెట్ మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆశ్చర్యంగా.. కొడుకు కన్నా నితీష్ తక్కువ ఆస్తులను కలిగి ఉండటం గమనార్హం.
సోమవారంనాడు నితీష్ తన స్థిర, చరాస్తులను వివరాలను వెల్లడించారు. చేతిలో ఉన్న నగదు, బ్యాంకు డిపాజిట్లు, ఢిల్లీలో ఓ ఫ్లాట్, ఆవులు, బర్రెలు, ఒక ఎక్సర్ సైజ్ సైకిల్ సహా మొత్తం రూ.56లక్షల విలువ చేసే సంపద తన వద్ద ఉన్నట్టుగా ఆయన వెల్లడించారు. ఆయన కుమారుడి ఆస్తుల విలువ రూ.2.36కోట్లుగా ఉండటం గమనార్హం.
ఇక నితీష్ కేబినెట్ లో కొలువుదీరిన ఆర్జేడీ అధినేత లాలూ తనయులు కూడా ఆస్తుల వివరాలు వెల్లడించారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తనకు స్వంత వాహనం కూడా లేదని ప్రకటించడం గమనార్హం. పలు చోట్ల ఫ్లాట్లు మాత్రం ఉన్నట్టు వెల్లడించారు.
లాలూ చిన్నకొడుకు, మంత్రి అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన వద్ద రూ.15లక్షలు విలువచేసే బైక్, రూ.29లక్షలు విలువ చేసే కారు, దినాపూర్, ఫుల్వారి షరీఫ్ లలో ప్లాట్లు ఉన్నట్టుగా వెల్లడించారు. జలవనరుల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లాన్ సింగ్ తన వద్ద ఒక పిస్టోల్, ఒక రైఫిల్ ఉందని తెలిపారు. చాలామంది మంత్రులు తమవద్ద తక్కువ సంపద ఉన్నట్టుగా వెల్లడించారు.
ఆస్తుల ప్రకటనలో ఆసక్తిని కలిగించిన అంశమేంటంటే.. మంత్రుల కన్నా వారి సతీమణుల వద్ద ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు తేలాయి.