సీఏఏతో మైనార్టీలకు వచ్చిన నష్టమేమీ లేదు, బీహార్ ముస్లింలకు గ్యారంటీ, ఆర్జేడీపై నితీశ్ నిప్పులు
పౌరసత్వ సవరణ చట్టంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తొలిసారి స్పందించారు. సీఏఏతో ముస్లింలకు వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్లో మైనార్టీలు సురక్షితంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ గత కొద్దిరోజుల నుంచి బీహార్లో ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నితీశ్ కుమార్ స్పందించారు.

నితీశ్ మాట
రాష్ట్రంలో మైనార్టీల రక్షణకు తాను గ్యారంటీ అని నితీశ్ కుమార్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఎలాంటి ఘటన జరగలేదని గుర్తుచేశారు. కానీ ప్రతిపక్షం మాత్రం మైనార్టీల్లో అభద్రతాభావం సృష్టించే పని చేస్తుందని విమర్శించారు. కానీ వారి ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కాబోవని చెప్పారు. కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్కు రాష్ట్రీయ జనతాదళ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నితీశ్ కుమార్ స్పందించారు.

21న బంద్
పౌరసత్వ సవరణ చట్టంతోపాటు జాతీయ పౌరసత్వ రిజిష్టర్ గురించి కూడా ఆర్జేడీ బంద్కు పిలుపునిచ్చింది. గురువారం వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విధ్వంసం సృష్టించడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. జేఏపీ, వీఐపీ పార్టీలు కూడా విపక్ష ఆందోళనకు మద్దతు తెలిపాయి.

టైర్లు కాల్చి..
పాట్నా సహా మిగతా ప్రాంతాల్లో కూడా బంద్ వాతావరణం నెలకొంది. కొందరు టైర్లను కాల్చి రోడ్లపై పడేశారు. నగరంలో పేరున్న విద్యాసంస్థలు సెలవులను ప్రకటించాయి. బుక్ స్టోర్, కోచింగ్ సెంటర్లు కూడా మూసివేశారు.

రైల్వే ట్రాక్ వద్ద..
మరోవైపు పాట్నాలో వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు రాజేంద్ర నగర్ టెర్మినల్ రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఉదయం రైళ్లు అరగంట ఆలస్యంగా నడిచాయి. ఉదయం 10 గంటల సమయంలో జేఏపీ పార్టీకి చెందిన కార్యకర్తలు టైర్లను కాల్చి రోడ్డుపై పడేశారు. మరికొందరు రాజేంద్ర నగర్ టెర్మినల్ ట్రాక్ వద్ద వేయడంతో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications