బీజేపీకి 'మాంఝీ' షాక్: కేజ్రీవాల్ దారిలో నితీష్, ఫాంలోకి వచ్చారా?
పాట్నా: బీహార్ రాజకీయాలు పలు మలుపులు తిరిగి, చివరకు జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం 20వ తేదీ) వరకు తాను బలపరీక్షలో నెగ్గుతానని ధీమా వ్యక్తం చేసిన మాంఝీ హఠాత్తుగా రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామాకు జేడీయూ బెదిరింపులు, కుట్ర రాజకీయాలను ఆయన ధ్వజమెత్తారు.
మరోవైపు, నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ పైన నిప్పులు చెరిగారు. రాంఝీ ముందుగానే రాజీనామా చేయవలిసి ఉండెనని, కానీ, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం అంతా డ్రామా నడిచిందని ఆరోపించారు. జేడీయును చీల్చాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో ఆయన బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను పదవి నుండి తప్పుకున్నందుకు ప్రజలు క్షమాపణలు కోరారు.
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన క్షమాపణను విపక్షాలు రాజకీయమని కొట్టేసినప్పటికీ.. ఢిల్లీ ప్రజలు ఆయనకు అఖండ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను నితీష్ కుమార్ అనుసరించారు. 49 రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసినందుకు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల్ని క్షమాపణ అడిగారు.
ఇప్పుడు నితీష్ కుమార్.. గత సార్వత్రిక ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకొన్నందుకు ప్రజలను క్షమాపణ కోరారు. నితీష్ కుమార్ క్షమాపణలు వ్యూహాత్మకమే అంటున్నారు. అయితే, ప్రధాని మోడీ పైన కోపంతో.. దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో కలవడం, ఎన్నికల సమయంలో మళ్లీ పదవి కోసం ఆరాటపడటం వంటి వాటిని ప్రజలు ఎంత వరకు సమర్థిస్తారో చూడాలంటున్నారు.
మరోవైపు, బీహార్లో ఎలాగైనా పట్టు సాధించాలకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది! నితీశ్ కుమార్ను దేబ్బతీయడానికి అనుసరించిన ప్రయత్నాలు ఫలించలేదు. మోడీని వ్యతిరేకించి నితీశ్కు దెబ్బతీయాలని భావించిన బీజేపీ.. నితిశ్కు వ్యతిరేకంగా బీహార్ సీఎం మాంఝీకి మద్దతుపలింది. అయితే, అనూహ్యంగా మాంఝీ రాజీనామా చేశారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ మాంఝీ చేత రాజీనామా చేయించిందనే ఆరోపిస్తున్నారు.
జేడీయూ మహాదళిత నేతను అవమానించిందని, తాము న్యాయం పక్షాన నిలిచామని, దళిత బిడ్డకు మద్దతిచ్చామని బీజేపీ జాతీయ నాయకత్వం పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. మాంఝీ రహస్య ఓటింగ్ కోరారని, అందుకు అనుమతి లభించకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారంటూ చెప్పింది.
మాంఝీ బీజేపీ మద్దతుతో అధికారంలో కొనసాగాలని భావించారు. మాంఝీకి మద్దతిస్తున్న బీజేపీ వైఖరిని నితీష్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. బీజేపీ నాయకులు జేడీయూలో అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని, ఆ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగుతోందని ప్రచారం సాగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మెజార్టీ వర్గానికి అధికారం దక్కకుండా అడ్డుకుంటున్నారని నితీష్ ఆరోపణలు చేశారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా నితీష్ కుమార్ను గవర్నర్ త్రిపాఠి ఆహ్వానించారు. నితీష్ ఎల్లుండి (ఫిబ్రవరి 22) ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
బీహార్ సంక్షోభానికి తెర!
మాంఝీ రాజీనామాతో బీహార్ సంక్షోభానికి తెరపడినట్లుగానే భావించవచ్చు. నితీష్ కుమార్కు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఆయనను గవర్నర్ ఆహ్వానించే అవకాశముంది. ఇదిలా ఉండగా, నితీష్ కుమార్ పాత ఫాంలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. మాంఝీ వైఖరి, బీజేపీ మద్దతుతో నితీష్కు బీహార్ ప్రజలు మళ్లీ పట్టం కడతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
నితీష్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను రాజీనామా చేసి తప్పు చేశానని, క్షమించాలని ప్రజలను కోరారు. మళ్లీ అలాంటి తప్పు చేయనని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మంచి చేస్తానని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్ను కోరామన్నారు. ఇన్ని పరిణామాలకు బీజేపీ కారణమని ఆరోపించారు.