పోలవరంతో టీకి నష్టం లేదు: సీఎం, కట్టాలి కానీ: రాజా
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగదని టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సోమవారం అన్నారు. రాజ్యసభలో పోలవరం అంశానికి సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకఱణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. తాను బిల్లుకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. తెరాస రాజకీయం కోసమే ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు.
పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు. తెరాసతో పాటు ఇతర ఎంపీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భద్రాచలం డివిజన్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగమే అన్నారు. పోలవరం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నారు.

పోలవరం కట్టాలి కానీ: రాజా
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, ఇది రాష్ట్రాలకు సంబంధించిదని కాదని డీ రాజా అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందేనని చెప్పారు. అయితే, దాని డిజైన్ మార్చాలన్నారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా డిజైన్ మార్చాలన్నారు.
వ్యతిరేకం కాదు: కల్పతరు దాస్
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజూ జనతా దళ్ ఎంపీ కల్పతరు దాస్ సోమవారం అన్నారు. రాజ్యసభలో పోలవరం పైన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఒడిశా ప్రయోజనాలు కాపాడాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.
పూర్తి న్యాయం చేయాలి: నంద కుమార్
పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని బీజేపీ ఎంపీ నందకుమార్ అన్నారు. ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని, అయితే నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. అలాగే అటవీ సంపద పైన కూడా ఆలోచించాలన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు తాము మద్దతిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications