హమ్మయ్యా: పాస్పోర్ట్ను ఈ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
పాస్పోర్టు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా...? పాస్పోర్టు కేంద్రాల చుట్టూ తిరిగి వేశారిపోతున్నారా...? ఇకపై ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే పాస్పోర్టు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను కేంద్రం మరింత సరళతరం చేసింది. ఇకపై పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు నేరుగా మొబైల్ నుంచి అప్లై చేయొచ్చు. ఇందుకోసం పాస్పోర్ట్ సేవా యాప్ పేరుతో ఓ యాప్ను ప్రభుత్వం రూపొందించింది. యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్లై చేశాకా... ఆ తర్వాత జరిగే వెరిఫికేషన్, ఇతర ఫార్మాలిటీస్ మీరు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా యాప్ ద్వారానే జరిగిపోతాయని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.
ఇటీవలే ఓ పాస్పోర్టు కేంద్రానికి వెళ్లిన జంటకు పాస్పోర్టు అధికారినుంచి చేదు అనుభవం ఎదురైంది. పాస్పోర్టు పొందాలంటే మతం మార్చుకోవాలని అధికారి సూచించడంతో ఆ జంట సుష్మాస్వరాజ్కు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ అధికారిని బదిలీ చేయడం జరిగింది. అయితే తన డ్యూటీని తాను కరెక్టుగానే నిర్వహించినట్లు అధికారి వెల్లడించారు.
అమ్మాయి తప్పుడు డాక్యుమెంట్లను పొందుపర్చిందని చెప్పుకొచ్చారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన నెటిజన్లు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందిగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే జూన్ 17 నుంచి 23వ తేదీవరకు తాను దేశంలో లేనందును ఏం జరుగుతుందో తెలియలేదని సుష్మా ట్వీట్ చేశారు.