ఫిబ్రవరిలో సెషన్స్, తెలంగాణపై చెప్పలేం: కమల్ నాథ్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు సమావేశాలు ఉంటాయని, ఆ సమయంలో తెలంగాణ బిల్లు పెట్టే విషయమై ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి కమల్ నాథ్ బుధవారం చెప్పారు. అయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే సమావేశాలు పదిహేను రోజుల పాటు ఉంటాయన్నారు.
ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంటు, బడ్జెట్ బిల్లులతో పాటు పలు పెండింగు బిల్లులను ప్రవేశ పెడతామని చెప్పారు. యూపిఏ 2కు ఇవే చివరి సమావేశాలు అన్నారు. తెలంగాణ బిల్లు అంశంపై ప్రశ్నిస్తే... ఇప్పుడే చెప్పలేమన్నారు.
హైదరాబాదుకు ఆజాద్
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. గాంధీ భవన్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆజాద్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆజాద్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు.
ఆజాద్ను కలిసిన వారిలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్, జానా రెడ్డి, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.
రాత్రి ఏడు గంటలకు కిరణ్ మీడియా సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి ఏడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.
సస్పెండ్ చేయాలి
తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా సభను అడ్డుకునేవారిని సస్పెండ్ చేయాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు వచ్చి నెల రోజులు అవుతున్నా చర్చ ప్రారంభించలేదని మండిపడ్డారు. బిల్లుపై ఓటింగ్ చేసే అధికారం సీఎంకు లేదని ఈటెల స్పష్టం చేశారు.