వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం: రూ.100 నుంచి 150 వరకు..!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరలు లేదా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగనున్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రమంగా వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ పెంపు పెద్దగా అనిపించలేదు కనిపించలేదు. జూలై నుంచి జనవరి మధ్య సబ్సీడీ వంట గ్యాస్ ధరలు సగటున 10 రూపాయలు పెరిగింది. ఇదిలా ఉంటే 2022 నాటికల్లా ఆయిల్ సబ్సీడీని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో వంటగ్యాస్ ధరలు పెరుగుతాయనేది వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఏడాదికల్లా సిలిండర్పై రూ.100 నుంచి రూ.150 పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆయిల్ ధరలు తగ్గించి అదే సమయంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా చేయడం వల్ల సబ్సీడీ పొందుతున్న అర్హులైన వినియోగదారులకు సిలిండర్పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీని క్రమంగా తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఏడాదిలోపే జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జూలై 2019- జనవరి 2020 వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సబ్సీడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ ధరలను సిలిండర్పై రూ.63 పెంచేశాయి. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం, చమురు కంపెనీలు సబ్సిడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) రేటును నెలకు కేవలం 10 రూపాయలు పెంచినట్లయితే, 15 నెలల కాలంలో కేంద్ర మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం సబ్సీడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ రూ.557గా ఉండగా ప్రభుత్వం రూ. 157 సబ్సీడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. చమురు ధరలు తగ్గితే సబ్సీడీ ధరలు కూడా పడిపోయే అవకాశం ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వం నుంచి రూ. 34,900 కోట్లు పరిహారం రూపంలో అందుకున్నాయి. ఎల్పీజీలను నియంత్రించడం వల్ల ఓఎంసీల మూలధనం పెరుగుతుంది.