ఒమిక్రాన్ వేరియంట్ అలర్ట్: ఆ 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక బృందాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు, వివిధ రూపాల్లో ఆంక్షలను అమలు చేయాలని సూచించింది. అంతేగాక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 400 దాటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఒమిక్రాన్ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందాలను పంపించాలని నిర్ణయించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిబెంగాల్, మిజోరం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్తున్నాయని పేర్కొంది.
శనివారం ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఢిల్లీలో ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 7వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా కేరళలో 2605, మహారాష్ట్రలో 1410, తమిళనాడులో 597 కేసులు వెలుగుచూశాయి.
కాగా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. హర్యానా కూడా ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆంక్షలున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై పలు చోట్ల నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నాయి.