కాంగ్రెస్కు సోనియా ట్రీట్మెంట్: 4 సార్లు గెలిచి.. దీనంగా డిపాజిట్ల కోసం తండ్లాట..
1998 నుంచి 2013 మధ్య కాలంలో 15 ఏండ్లపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ.. దేశరాజధానిపై క్రమంగా పట్టుకోల్పోతూ.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితికి దిగజారిపోయింది. 1952నాటి ఎన్నికలనూ కలుపుకుంటే ఇప్పటిదాకా ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం 7 ఏడు సార్లు ఎన్నికలు జరగగా, అందులో 4సార్లు విన్నర్ కాంగ్రెసే. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా, వచ్చే నెల 8న జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటుకునేలా కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
11న సీఈసీ భేటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా గాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలోనే ఈనెల 11న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) మీటింగ్ జరగనుందని ఏఐసీసీ బుధవారం ఒక ప్రకటన చేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార సరళి, స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరిని దింపాలి.. తదితర అంశాలపై సీఈసీ చర్చించనుంది.
కమిటీలో ఉన్నది వీళ్లే..
సోనియా ప్రెసిడెంట్ గా ఉన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ముకుల్ వాస్నిక్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, సోనియా పొలిటికల్ సెక్రటరీ అహ్మద్ పటేల్, ఎంపీ అంబికా సోని, మాజీ ఎంపీ కేసీ వేణుగోపాల్, మాజీ ఎంపీ గిరిజా వ్యాస్, మాజీ ఎంపీ జనార్ధన్ ద్వివేది, మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, ఎంపీ అస్కార్ ఫెర్నాండెజ్, సీనియర్ నేత మొహసీనా కిద్వాయ్ ఉన్నారు. 11నాటి భేటీకి వీళ్లతోపాటు ఢిల్లీకి చెందిన కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రియాంక కూడా భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది.
పూలమ్మిన చోటే కట్టెలు..
1952లో తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పుడు సహజంగానే కాంగ్రెస్ గెలిచినా, జనసంఘ్ నుంచి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత ఢిల్లీని పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో అసెంబ్లీ రద్దయింది. మళ్లీ 1993లో ఢిల్లీని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మర్చారు. 1993 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ గెలుపుతో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, 2008లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఎక్కువసీట్లొచ్చిన బీజేపీ పక్కకు జరగడంతో.. కాంగ్రెస్ సపోర్టుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. లోక్ పాల్ బిల్లుపై వివాదం కారణంగా ఏడాదిలోపే ఆయన రాజీనామా చేశారు.
టార్గెట్ సెకండ్ ప్లేస్?
సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవడానికే పోటీపడుతుంది. అయితే గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఎకాఎకిన అధికారం సాధించే సీన్ కనిపించడంలేదు. వెల్ఫేర్ స్కీములతో క్రేజీవాల్, కేంద్రం అండతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుండగా.. రేసులో ఉన్నామని చాటుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కనీసం రెండో అతి పెద్ద పార్టీగానైనా నిలబడాలన్నది కాంగ్రెస్ టార్గెట్ కావొచ్చని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.