మోడీ సర్కార్ కొత్త చట్టం దెబ్బ: 2,100 కంపెనీలు రూ.82వేల కోట్లు చెల్లించాయి
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. తమకు ఇక డబ్బులు రావని వదిలేసుకున్న రూ.83వేల కోట్ల రుణాలు తిరిగి బ్యాంకులకు వచ్చాయి. తమ సంస్థలపై చర్యలు తీసుకుంటారని, ఆస్తులను వేలం వేస్తారని భావించిన 2100 కంపెనీలు గతంలో తాము తీసుకున్న రుణాలను సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆగమేఘాల మీద ప్రయత్నాలు జరిపి, తిరిగి చెల్లింపులు చేస్తున్నాయి.
ఇదంతా మోడీ ప్రభుత్వం సాధించిన విజయమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కేంద్రం ఇటీవల ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్)ను తీసుకు వచ్చింది. దీని దెబ్బకు పలు కంపెనీలు రుణాలు చెల్లించాయి. ఈ చట్టం డిఫాల్టర్లపై ప్రభావం చూపింది.

కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 2,100 కంపెనీలు తమ రుణాలను చెల్లించాయి. ఐబీసీ చట్టంలో మార్పుల అనంతరం, ఎన్పీఏగా బ్యాంకులు ప్రకటించిన ఆస్తులపై ప్రమోటర్లకు ఎటువంటి హక్కులూ ఉండవు. ఇదే సమయంలో 90 రోజుల పాటు రుణ చెల్లింపు ఆగిపోతే ఆ రుణాన్ని, రుణం పొందేందుకు తనఖా పెట్టిన ఆస్తిని నిరర్థక ఆస్తి కింద ప్రకటించి తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని కొత్త చట్టం చెబుతోంది.
ప్రభుత్వం చట్టాన్ని మార్చిన అనంతరం పలు కంపెనీలు, కంపెనీల కుటుంబాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం తగ్గలేదు. లోన్ డిఫాల్టర్లపై ఒత్తిడి పెరిగిందని, వారు రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని, కేంద్రం తీసుకు వచ్చిన ఐబీసీ వల్లనే ఇదంతా సాధ్యమైందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications