Diwali Gift: హిందువులు సిక్కులకు 10,000 క్యాష్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..
Cash To Hindus Sikhs: దాయాది దేశం పాకిస్థాన్ వాస్తవానికి మతం ప్రాతిపధికన ఇండియా నుంచి వేరుపడిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మైనారిటీలుగా హిందువులు ఉన్నారు. వారిలో చాలా మంది దుర్భర పరిస్థితులను చూస్తున్నారని చాలాసార్లు వార్తల్లో మనం విన్నాం. అక్కడ హిందువుల ఆలయాలను కూల్చటం, వాటిని మసీదులుగా మార్చటం వంటి చర్యల గురించి తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం.
ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి పెద్ద ప్రకటన వచ్చింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా 2,200 సిక్కు, హిందూ కుటుంబాలకు శుభవార్త చెప్పారు. అక్కడి హిందువులకు పండుగ గిఫ్ట్ కింద 10,000 పాకిస్థానీ రూపాయలు నగదు బహుమతిగా అంచిచనున్నట్లు ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.3,000గా ఉంది. "మా హిందూ మరియు సిక్కు సోదరులకు" పండుగ కార్డులను ఆలస్యం చేయకుండా జారీ చేయడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం గురునానక్ 555వ జయంతి సందర్భంగా వచ్చే నెలలో విదేశీ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్రికుల ఆతిథ్యంలో ఎలాంటి ప్రయత్నం జరగకుండా అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తామని ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అదనపు కార్యదర్శి ష్రైన్స్ సైఫుల్లా ఖోఖర్ తెలిపారు. ఈ యాత్రికులకు వసతి, రవాణా, ఆహారం వంటి సేవలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గరునానక్ జయంతికి భారత్ నుంచి 3000 మంది యాత్రికులు, ఇతర దేశాల నుంచి 1000 మంది సిక్కు యాత్రికులు వస్తారని ఖోఖర్ వెల్లడించారు.
ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి జరుపుకోనున్నారు. గురునానక్ జయంతి నవంబర్ 15న వస్తుంది. ఈ సమయంలోనే కర్తార్పూర్ కారిడార్పై తమ ఒప్పందాన్ని పొడిగించడానికి అంగీకరించినట్లు భారత్-పాక్ మంగళవారం ప్రకటించాయి. గురునానక్ తన జీవితంలో చివరి సంవత్సరాలు గడిపిన గురుద్వారాకు భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తాయి. ఈ క్రమంలోనే కర్తార్పూర్ కారిడార్ను ఉపయోగించే భారతీయ యాత్రికులకు వసూలు చేసే 20 డాలర్ల సర్వీస్ ఛార్జీలను మాఫీ చేయాలని భారత్ మరోసారి పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
విదేశీ యాత్రికుల కోసం వీసాల జారీని క్రమబద్ధీకరించడానికి వీసా ఆటోమేషన్ సిస్టమ్ అమలు చేసే పనిలో పాకిస్థాన్ ఉంది. యాత్రికులకు అవసరమైన సౌకర్యాలతో పాటు, సిక్కు యాత్రికుల కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ సమయంలో భద్రతను నిర్ధారించడానికి బోర్డు నుంచి 100 మంది సెక్యూరిటీ గార్డులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. నవంబర్ 15న నంకనా సాహిబ్లోని గురుద్వారా జనమ్ ఆస్థాన్లో గురునానక్ జయంతి వేడుకను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications