ఉగ్రదాడి: పంజాబ్-పాక్ ల మధ్య ఫోన్ కాల్స్
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ ఎయిర్ బేస్ దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, భద్రతా దళానికి చెందిన మరో జవాను వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి పఠాన్ కోట్- పాకిస్థాన్ లమధ్య నాలుగు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు గుర్తించి ట్రేస్ చేశామని అధికారులు చెప్పారు.
పాక్- పఠాన్ కోట్ ల మధ్య ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు అన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరగడం విచారకరమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు.
ఉగ్రదాడిలో ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు అన్నారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని అధికారులు స్పష్టం చేశారు.

శనివారం వేకువ జామున సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడులకు దిగారు. భద్రతా దళాలు ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అయితే దాడికి వచ్చిన ఉగ్రవాదులు నలుగురేనా, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులకు పాల్పడింది ఎవరు అనే విషయం తెలియడం లేదు.
ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఉగ్రదాడిని జాతీయ భద్రతా దళాలు, జవాన్లు, పంజాబ్ పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. పాకిస్థాన్ మన పొరుగు దేశం అని చెప్పారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని, అయితే ఉగ్రదాడులను మాత్రం సహించమని, ధీటుగా సమాధానం చెబుతామని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications