కోర్టుకు శశికళ: ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ రంగంలోకి పన్నీరు వర్గం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు శశికళ, తన వర్గం ముఖ్య నేతలతో బెంగళూరుకు బయలుదేరిన తరువాత.. సీఎం పన్నీర్ సెల్వం వర్గం రంగంలోకి దిగింది.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు శశికళ, తన వర్గం ముఖ్య నేతలతో బెంగళూరుకు బయలుదేరిన తరువాత.. సీఎం పన్నీర్ సెల్వం వర్గం రంగంలోకి దిగింది. ఇప్పటికీ రిసార్టులోనే ఉన్న పలువురు ఎమ్మెల్యేలను కలిశారు.
కాగా, శశికళ వర్గం ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని కోరేందుకు పన్నీర్ సెల్వం వర్గ నేత పాండ్యరాజన్ గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం తీసుకున్న నిర్ణయాలను పక్కనబెట్టి, పన్నీర్ కు మద్దతు పలకాలని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని పాండ్యరాజన్ ఎమ్మెల్యేలకు హితబోధ చేయనున్నారని సమాచారం.
పార్టీలో దివంగత జయలలిత నమ్మిన వ్యక్తి పన్నీర్ సెల్వమేనని వారికి గుర్తు చేసి.. ఆయన వెనుకే నడుద్దామని పాండ్యరాజన్ కోరనున్నారు. కాగా, శశికళతో పాటు కేసులో మిగతా ఇద్దరు నిందితులైన ఇళవరసి, సుధాకరన్లు కూడా బెంగళూరుకు బయలుదేరారు. వీరంతా సాయంత్రంలోగా ట్రయల్ కోర్టుకు హాజరై.. లొంగిపోతున్నట్టు వెల్లడించనున్నారు.