రైళ్లల్లో ప్రయాణికుల లగేజీపై కఠిన ఆంక్షలు
Deepavali 2024: దీపావళి పండగ సమీపించింది. గురువారం నాడు దేశవ్యాప్తంగా దీవాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటుంటారు. ఛోటీ దీపావళి, మహాలక్ష్మి వ్రతం, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి శుభ కార్యాలను నిర్వహిస్తుంటారు. తోడబుట్టిన వాళ్ల క్షేమాన్ని కోరుకుంటూ భాయ్ దూజ్ను జరుపుకొనే సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.

దీపావళి పండగకు తోడు వరుస సెలవులు రానుండటంతో నగరాలు ఖాళీ అవుతున్నాయి. తమ సొంతూళ్లకు ప్రయాణం కట్టారు ప్రజలు. ఫలితంగా ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భారీ తాకిడి నెలకొంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది.
రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ప్లాట్ ఫామ్లపై అదనపు సిబ్బందిని మోహరింపజేశారు. రైలు ఎక్కేటప్పుడు తోపులాట, తొక్కిసలాట సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. క్యూ లో నిల్చొని రైలు ఎక్కేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు పలు సూచనలను జారీ చేశారు. రైళ్లల్లో ఎలాంటి బాణాసంచాలను తీసుకెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. బాణాసంచా, వాటిని తయారు చేయడానికి వినియోగించే వస్తువులు, మందుగుండు సామాగ్రిని తరలించడం మంచిది కాదని, వాటిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లకూడదని సూచించింది.

ఇప్పుడు తాజాగా ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపైనా ఆంక్షలను విధించారు రైల్వే అధికారులు. రైళ్లల్లో పరిమితికి మించిన లగేజీని తీసుకెళ్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పశ్చిమ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే బాంద్రా టెర్మినస్లో చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ప్రయాణీకుడు పరిమితంగానే లగేజీని పట్టుకెళ్లాల్సి ఉంటుందని ఆదేశించారు. స్కూటర్లు, సైకిళ్ల మీద ఎంత పరిమాణంలో లగేజీని తీసుకెళ్లగలరో..అంతే పరిమాణంలో రైలు ప్రయాణంలో పట్టుకెళ్లాలని సూచించారు. 100 x 100 లేదా 100 x 70 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications