లోక్సభ ఎన్నికల కోసం కేంద్రం తాయిలాలు తయార్: జనవరి 1 నుంచి..!!
Petrol Diesel Price: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన జోష్ మీద ఉంది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు అప్పటివరకు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను సొంతం చేసుకోగలిగింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తోన్న ఈ పోటీల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోగలిగింది.
లోక్సభ ఎన్నికల్లో తమ విజయాన్ని మరింత సులభతరం చేసుకోవడంపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా- తాయిలాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు భారీగా నిధులను కేటాయించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పీఎం- కిసాన్ యోజనకు లక్ష కోట్ల రూపాయల మేర అదనపు బడ్జెట్ను కేటాయించే అవకాశాలను పరిశీలిస్తోంది.

అదే సమయంలో- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపైనా కసరత్తు మొదలుపెట్టింది. అన్నీ సవ్యంగా సాగితే.. జనవరి 1వ తేదీ నుంచే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపును అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా చమురు కంపెనీలతో తొలి విడత సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఆయిల్ కంపెనీలు- హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ నష్టాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చివరి మూడు త్రైమాసికాల్లో ఈ మూడు కంపెనీల నష్టాలు భారీగా తగ్గాయి. 28,000 కోట్ల రూపాయలకు పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం, రష్యా నుంచి ముడి చమురును ఇదివరకటి కంటే చవగ్గా అందుకుంటోండటం, దాదాపుగా మూడు సంవత్సరాలుగా దేశంలో భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం వంటి కారణాలతో వాటి ఆదాయం పెరిగింది. నష్టాలు 28,000 కోట్ల రూపాయలకు తగ్గాయి.
ఆయా పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన నేపథ్యంలో దీన్ని అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేట్లు ఎంత వరకు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications