Modi v/s Kejriwal:ఢిల్లీలో యుద్ధం ప్రారంభం..!!
Delhi Assembly Election 2025:గత దశాబ్దకాలంగా ఢిల్లీని ఆమ్ ఆద్మీ సర్కార్ నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,675 గృహాలను ఢిల్లీలోని స్లమ్ ప్రాంతాల్లో ప్రారంభించిన ప్రధాని మోదీ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి అవినీతిని ప్రోత్సహించిందని దుయ్యబట్టారు. తాను అనుకుంటే అద్దాల మేడ కట్టుకునేవాడినని.. అయితే తాను పేదల గురించి ఆలోచించి వారికోసం 4 కోట్ల గృహాలను నిర్మించాలని తలచి పూర్తి చేసినట్లు ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కోసం భారీస్థాయిలో ఖర్చు చేశారన్న ఆరోపణలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ అధికారిక నివాసం కోసం అత్యంత ఖరీదైన గ్యాడ్జెట్స్, పరికరాలను వినియోగించినట్లు అక్టోబరు నెలలో ప్రజాపనుల శాఖ విడుదల చేసిన లేఖలో ఉంది. ఈ పరికరాల కొనుగోలు కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఈ అంశమే ఢిల్లీ ఎన్నికల వేళ అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష బీజేపీ మధ్య హాట్ టాపిక్గా నిలిచింది. చిన్న గ్యాప్ దొరికితే చాలు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని, అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీలో బీజేపీ జోక్యాన్ని అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. అంతేకాదు మోదీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అవి తన వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యనందించడంలో సరికొత్త రికార్డు సృష్టించిందని,ఆరోగ్య వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిందని, వనరులను అభివృద్ధి చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు.ఇవన్నీ బీజేపీ హయాంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ గత పదేళ్లలో ఢిల్లీకి ఏం చేయలేదని అన్నారు కేజ్రీవాల్.2022 నాటికి శాశ్వత గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఐదేళ్లలో కేవలం 4700 ఇళ్లు మాత్రమే నిర్మించిందని గుర్తు చేశారు. అదే ఆప్ ప్రభుత్వంలో 22వేల తరగతులు, మూడు కొత్త యూనివర్శిటీలు, లెక్కలేనన్ని అభివృద్ధి పనులు చేసి చూపామని చెప్పారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మెరుగైన వనరుల అభివృద్ధికి కృషి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.ఈ సందర్భంగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అశోక్ విహార్లో ఉన్న సీతు స్లమ్ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు లేదా అర్హులకు ప్రధాని మోదీ అందజేశారు. ఈ ఇళ్ల కోసం వారు సాధారణ నిర్మాణపు ఖర్చను మాత్రమే భరించారు. ఇక ఇదే సమయంలో ప్రధాని మోదీ నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినగర్లో రెసిడెన్షియల్ క్వార్టర్స్ను ప్రారంభించారు.
మురికివాడలను కూల్చేసి వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా బీజేపీ వ్యవహరించిందని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీలోని మురికివాడలన్నిటినీ కూల్చివేసేవారని అన్నారు. ఢిల్లీని నిజంగా నాశనం చేసింది బీజేపీనే అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications