ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించిన మోడీ, తొలి టికెట్..: మ్యూజియం విశేషాలు(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయం( హైటెక్ మ్యూజియం)ను ప్రారంభించారు. స్వాతంత్ర్య వచ్చిననాటి నుంచి భారతదేశానికి ప్రధానమంత్రులుగా సేవలంగించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధానమంత్రి సంగ్రహాలయంలో పొందుపర్చారు.
మాజీ ప్రధానుల విశిష్టతలు తెలిపే మ్యూజియం
ఢిల్లీ తీన్మూర్తి మార్గ్లోని నెహ్రూ మ్యూజియంలో ఏర్పాటైన దీనిని ప్రారంభించే ముందు.. ప్రధాని స్వయంగా టికెట్ కొని లోపలికి ప్రవేశించారు. మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. ప్రస్తుత యువతరానికి తెలిపేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
సిద్ధాంతాలకు అతీతంగా ప్రధానుల సేవలకు గౌరవం
సిద్ధాంతాలకు అతీతంగా ప్రధానుల సేవలకు గౌరవం ఇవ్వాలన్న మోడీ సంకల్పం మేరకు మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. పదవీకాలంతో సంబంధం లేకుండా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ప్రధానమంత్రి సంగ్రహాలయ టికెట్ ధరలు ఇలా.. వారికి ఆఫర్లు
కాగా, "ప్రధానమంత్రి సంగ్రహాలయ" టికెట్ ధర ఆన్లైన్లో కొనుగోలు చేస్తే రూ. 100, భారతీయులకు ఆఫ్లైన్ మోడ్లో రూ. 110 అయితే విదేశీయులకు మాత్రం దీని ధర రూ. 750వరకూ ఉంటుంది. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ ఇస్తారు. కాలేజీ, హైస్కూల్ విద్యార్థులు బుకింగ్లపై 25 శాతం తగ్గింపు పొందొచ్చు. మ్యూజియం చిహ్నం.. జాతీయతను, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ధర్మ చక్ర గుర్తును చేతులతో పట్టుకున్నట్లుగా లోగోను సిద్ధం చేశారు. మ్యూజియంలో మొత్తం 43గ్యాలరీలను ఏర్పాటు చేశారు.