IPL 2026: ముంబై ఇండియన్స్ కు కొత్త కెప్టెన్..! హార్దిక్, స్కై గైర్హాజరీలో..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. అదే సమయంలో ముంబై జట్టుకు కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారు. పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తాజాగా జట్టుకు దూరమయ్యాడు. ప్రత్యామ్నాయంగా భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగిద్దామంటే అతనూ జట్టుకు దూరమయ్యాడు. దీంతో ముంబై జట్టును నడిపించే వారే కరువయ్యారు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ పాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పైనే మరోసారి మొగ్గు చూపాల్సిన పరిస్ధితి వచ్చేసింది. రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ అప్పగించడం ద్వారా జట్టును తిరిగి గాడిన పెట్టాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 10న బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మరోసారి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2026లో ఆడిన 10 మ్యాచ్లలో కేవలం మూడు విజయాలతో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆరు పాయింట్లు కలిగిన ముంబై.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్లలో గెలవడం అత్యంత కీలకం. ఈ తరుణంలో కెప్టెన్ గాయపడటం, తాత్కాలిక కెప్టెన్ గా నియమించిన సూర్య కుమార్ కూడా దూరం కావడంతో రోహిత్ శర్మ సహా పలు ప్రత్యామ్నాయాల్ని ముంబై ఇండియన్స్ పరిశీలిస్తోంది. రోహిత్ కు ఛాన్స్ ఇస్తే ముంబై గాడిన పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications