మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇకపై చికెన్ బిర్యానీ..!
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు సీఎం విజయ్ (CM Vijay) మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచేందుకు వీలుగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తున్న మధ్యాహ్నం భోజనం మెనూలో చికెన్ బిర్యానీని కూడా చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాాదనను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ వెల్లడించారు.
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలనే ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి రాజ్ మోహన్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రధాన రాజకీయ యుగం తమదైన రీతిలో పాఠశాల పోషకాహార కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ఆయన గుర్తుచేశారు. కామరాజ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టగా, కరుణానిధి గుడ్లను చేర్చారని, ఎంజీఆర్ దానిని పౌష్టి భోజన కార్యక్రమంగా మార్చారని, జయలలిత వారం పొడవునా గుడ్ల పంపిణీని విస్తరించారని మంత్రి గుర్తుచేశారు.

ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని ప్రవేశపెట్టాలనే కోరిక తనకు ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనలో ఉన్నప్పటికీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన చెప్తున్నారు. రాజ్మోహన్ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, చికెన్ బిర్యానీని చేర్చడం అనేది ఇటీవలి సంవత్సరాలలో తమిళనాడు పాఠశాల భోజన మెనూలో అత్యంత ముఖ్యమైన మార్పు కాబోతోంది. పిల్లల పోషణ, పాఠశాల హాజరును మెరుగుపరిచే సంక్షేమ పథకాలకు దీన్ని కొనసాగింపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి టిఫిన్ కోసం సుమారు రూ.15 కేటాయిస్తున్నారు. గోధుమ, రవ్వ ఉప్మా వంటి పునరావృతమయ్యే వంటకాల స్థానంలో మరింత పోషకమైన, రుచికరమైన ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.














Click it and Unblock the Notifications