బీఆర్. అంబేద్కర్ ను ఓడించి అవమానించాలని కాంగ్రెస్ ప్లాన్, భారతరత్న ఇవ్వలేదు, మోడీ ఫైర్!
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో దళితులను తప్పుదోవపట్టించి వారిని మోసం చెయ్యాలనే నీచానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. నమో app ద్వారా కర్ణాటకలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్లం మోర్చ కార్యకర్తలతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. దళిత బంధువులారా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని మీరు నమ్మకండి, దళితులకు బీజేపీ ప్రకటించిన పథకాలు మరే పార్టీ ప్రకటించలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించి అవమానించాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు తీరని అన్యాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
దళిత ఎంపీలు ఎక్కవ
బీజేపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. కర్ణాటక నుంచి దళిత ఎంపీలు ఎన్నిక అయ్యారని ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. దళితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అంబేద్కర్ పంచ క్షేత్రాలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పంచ క్షేత్రాలను అభివృద్దికి చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. మౌవ్, నాగపుర, ఢిల్లీలోని 26 ఆలీపుర రోడ్డు, దాదర్, లండన్ ప్రాంతాలలో డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తీర్థ యాత్ర పంచ క్షేత్రాలను అభివృద్ది చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.
అంబేద్కర్ ను ఓడించిన కాంగ్రెస్
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ లోక్ సభలో అడుగుపెట్టకుండా ఆయన్ను ఓడించి అవమానించాలని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ కుళ్లు రాజకీయాలు గుర్తించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చివరికి బెంగాల్ నుంచి బీఆర్. అంబేద్కర్ ను పార్లమెంట్ కు పంపించారని ప్రధాని మోడీ అన్నారు.
భారతరత్న ఎవరిచ్చారు
మొదటి నుంచి డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను 50 ఏళ్లకు పైగా అవమానించిందని, భారతరత్న ఇవ్వాడానికి నిరాకరించారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. చివరికి కాంగ్రెస్ కుట్రలు గుర్తించిన బీజేపీ డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించిందని ప్రధాని మోడీ వివరించారు.
మరుగుదోడ్లు అని వ్యంగంగా
పేదలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీలకు చెందిన మహిళలు మరుగుదోడ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వాటిని నిర్మించడానికి పథకం మొదలు పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యంగంగా మాట్లాడిందని ప్రధాని అన్నారు.
కాంగ్రెస్ కు గిట్టదు
ఇప్పుడు దేశంలో 7 కోట్ల మరుగుదోడ్లు నిర్మించి మహిళల కష్టాలు, ఇబ్బందులు తీర్చామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమీ సమాధానం చెబుతుందని ప్రధాని మోడీ ప్రశ్నించారు. పేదలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీలు, మురికివాడల్లో నివాసం ఉంటున్న వారిని చూస్తే కాంగ్రెస్ పార్టీకి గిట్టదని, వారి ఓట్లు మాత్రం కావాలని ప్రధాని రేంద్ర యోడీ ఆరోపించారు.