ఇదీ- ఒలింపిక్లో దేశానికి పతకాలను తెచ్చిపెట్టిన రెజ్లర్ల దుస్థితి: హింసించిన యూపీ బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల కేసు కొలిక్కి రావట్లేదు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేదు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది.
ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్పై వెల్లువెత్తాయి.

ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన కొనసాగిస్తోన్నారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకుంటామంటూ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు నిరసనలను నిలిపివేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి జనవరిలో మేరీకోమ్ సారథ్యంలో అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది.
నాలుగు వారాల్లోగా నివేదికను అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదు. రోజులు గడుస్తున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోవడంతో మరోసారి నిరసన దీక్షలకు దిగారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు.
ఆదివారం రాత్రి వారంతా జంతర్ మంతర్ వద్దే ఫుట్పాత్పై నిద్రించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను వినేష్ ఫొగట్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్పాత్ వరకు అంటూ క్యాప్షన్ను జోడించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దర్యాప్తు జరిపించాలనే డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ వారు ప్రశ్నిస్తోన్నారు.
కాగా- లైంగిక వేధింపుల అంశం మీద బ్రిజ్ భూషణ్పై వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పోక్సో చట్టం కింద ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినేష్ ఫొగట్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ మహిళా రెజ్లర్లను లైంగికంగా హింసించాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications