దేశ రాజధానిలో మళ్లీ చెలరేగిన హింస: వాహనాలకు నిప్పు.. గాలిలో కాల్పులు.. !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. 24 గంటలుగా కాస్త కుదురుకున్నట్టుగా కనిపించిన ఉద్రిక్త వాతావరణం మళ్లీ భగ్గుమంటు అంటుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా న్యూఢిల్లీలో వరుసగా ఆందోళనలను నిర్వహిస్తూ వస్తోన్న ప్రదర్శనకారులు రెచ్చిపోయారు. ప్రతిష్ఠాత్మక ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
మండుతున్న ఉత్తర ప్రదేశ్: డజనుకు పైగా జిల్లాల్లో హింస: వాహనాలకు నిప్పు..పోలీసులపైకి రాళ్లు..!
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆందోళనకారులపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పెద్ద ఎత్తున లాఠీ ఛార్జీ చేశారు. న్యూఢిల్లీలోని దరియాగంజ్, ఇండియా గేట్ ప్రాంతాల్లో ఆందోళనకారులు మెరుపు ప్రదర్శనను నిర్వహించారు. ఒకేసారి వందల సంఖ్యలో దరియాగంజ్ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను తగులబెట్టారు. ఉద్దేశపూరకంగానే వారు ఈ ఘటనకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఆందోళనకారులు తమ వెంట పెట్రోల్ క్యాన్లను తెచ్చుకున్నారని అంటున్నారు. శాంతియుతంగా ప్రదర్శనలను నిర్వహించే వారికి పెట్రోల్ క్యాన్లతో పనేమిటని ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి పలు వాహనాలు బలి అయ్యాయి. కనిపించిన వాహనాన్ని కనిపించినట్టే నిప్పు పెట్టుకుంటూ పోయారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వందల సంఖ్యలో గుమికూడిన నిరసనకారులను చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారు. వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు. భాష్పాయువు గోళాలను విసిరారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. గాల్లోకి కాల్పులు జరపడంతో దరియాగంజ్ ప్రాంతం నుంచి పారిపోయిన ఆందోళనకారులు తమ నిరసనలను ఇతర ప్రాంతాల్లోకి వ్యాపింపజేశారు. ఇండియా గేట్ కు వెళ్లే మార్గంలో విధ్వంసాన్ని సృష్టించారు.