మెట్రో రైలు కిందపడి పోలీసు ఆత్మహత్య
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన కానిస్టేబుల్ మెట్రో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సంజయ్ ప్రసాద్ (30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారులు చెప్పారు.
ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ లో సంజయ్ ప్రసాద్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలం నుంచి ఇతను సాటి ఉద్యోగులతో ఎక్కువగా మాట్లాడటం లేదు. గురువారం సాయంత్రం పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లాడు.
తరువాత గురుగావ్ లోని హూడా సెంటర్ నుంచి బయలుదేరిన మెట్రో రైలు పటేల్ చౌక్ స్టేషన్ దాటుతున్న సమయంలో రెండో ఫ్లాట్ ఫాం నుంచి కిందకుదూకేశాడు. రైలు కిందపడటంతో తీవ్రగాయాలైన సంజయ్ ప్రసాద్ మరణించాడు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంజయ్ ప్రసాద్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.