చైనా బోర్డర్కు బైక్ రైడింగ్: ఈ డైనమిక్ లీడర్ ఎవరు?
లేహ్: తలకు హెల్మెట్, కూలింగ్ గ్లాసెస్, చేతులకు గ్లోవ్స్, కాళ్లకు గార్డ్స్, రైడింగ్ షూస్, సేఫ్టీ జాకెట్ వేసుకుని పక్కా ప్రొఫెషనల్ బైక్ రైడర్గా కనిపిస్తోన్న ఈ డైనమిక్ లీడర్ ఎవరో గుర్తు పట్టగలరా?, గుట్టలను అవలీలగా అధిగమించడానికి అనువుగా ఉండే కేటీఎం 390 మౌంటెయిన్ బైక్ పై రయ్ మంటూ దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఈ జాతీయ స్థాయి నాయకుడెవరో తెలుసుకోవాలని ఉందా?
ఆయనే- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రస్తుతం లఢక్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటిస్తోన్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కలిసి లఢక్లో స్థానికులతో సమావేమౌతోన్నారు. వారి బాగోగులను అడిగి తెలుసుకుంటోన్నారు.

ఇవ్వాళ ఆయన బైక్ అడ్వెంచర్కు దిగారు. లఢక్ రాజధాని లేహ్ నుంచి చైనా సరిహద్దుల వరకు బైక్ రైడింగ్ తలపెట్టారు. లఢక్ తూర్పు ప్రాంతంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖకు సమీపంలో గల పంగ్యాంగ్ లేక్ వద్దకు బైక్పై తరలి వెళ్లారు. దీనికోసం మౌంటెయిన్ బైక్ను వినియోగించారు.
లేహ్ నుంచి సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంగ్యాంగ్ లేక్. అదే చివరి సరిహద్దు. తన తండ్రి, దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతిని అక్కడే జరుపుకోనున్నారు రాహుల్ గాంధీ. ఈ రాత్రికి పంగ్యాంగ్ లేక్ వద్ద, మనదేశ ఆర్మీకి చెందిన చెక్ పోస్ట్లో బస చేయనున్నారు.

రాజీవ్ గాంధీ జయంతిని పంగ్యాంగ్ లేక్ వద్ద జరుపుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి లేహ్కు చేరుకుంటారు. ఈ నెల 25వ తేదీ వరకు లఢక్లోనే పర్యటించనున్నారాయన. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశం పంగ్యాంగ్ లేక్ మాత్రమేనని రాజీవ్ గాంధీ ఎప్పుడు చెబుతుండేవారని, అందుకే ఆయన జయంతిని అక్కడ జరుపుకోనున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.
రాహుల్ గాంధీ వినియోగించిన ఈ బైక్ కేటీఎం 390 అడ్వెంచర్స్. 373 సీసీ బైక్ ఇది. గరిష్ఠంగా 32 కిలోవాట్ల శక్తి, 37 ఎన్ఎం టార్క్ను విడుదల చేయగలదు. ఈ అడ్వెంచర్-టూరర్ గరిష్ఠంగా గంటకు 155 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఢిల్లీ కరోల్ బాగ్లో బైక్ మెకానిక్స్ను కలుసుకున్నప్పుడు.. కేటీఎం 390 మెళకువలను తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. అది ఇప్పుడు ఉపయోగపడిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications