వారణాసిలో రాహుల్ రోడ్ షో: మోడీపై అమేథీ రివెంజ్
వారాణసి: తాను పోటీ చేసిన అమేథీ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన నరేంద్ర మోడీపై వారాణాసిలో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నట్లున్నారు. వారణాసిలో ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. వారణాసిలో శనివారం ప్రచారానికి తెరపడుతుంది. ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ తన రోడ్ షోను ముస్లింలు అధికంగా గల గోల్ గద్దా ప్రాంతం నుంచి ప్రారంభించి నాలుగు కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఈ దూరానికి ఆయనకు నాలుగు గంటల సమయం పట్టింది. రాహుల్ రోడ్ షో నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో కన్నా ఎక్కువ దూరం సాగింది.
తాము విజయం సాధించడానికే పోటీ చేస్తున్నామని, తాము గెలిచి తీరుతామని రాహుల్ గాంధీ అన్నారు. షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మల్లా ఖాన్ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటిస్తూ రోడ్షోలో షెహనాయి వాయించారు. మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి అంతకు ముందు వారు నిరాకరించారు.
వారణాసిలో ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. రాహుల్ చుట్టూ పెద్ద యెత్తున పోలీసులు భద్రతగా ఉన్నారు. త్రివర్ణాలతో కూడిన టోపీలు ధరించి కాంగ్రెసు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.