ఒత్తిడికి చెక్-ఆనందానికి చోటు: సీఏపీఎఫ్ జవాన్లకు 100 రోజుల సెలవు దినాలు!
న్యూఢిల్లీ: ఇది కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్)కు చెందిన జవాన్ల కుటుంబాలకు శుభవార్తే. ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబంతో గడిపేందుకు జవాన్లకు అనుమతించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదన త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెలవులకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పాలసీ అమలులో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హోంశాఖ పలుమార్లు చర్చలు జరిపింది. మార్చి నెల ప్రారంభంలోనూ సమావేశమైంది. జవాన్లపై పని ఒత్తిడి తగ్గించడం, అత్యంత సవాలుగా ఉన్న పలు ప్రాంతాల్లో కష్టతరమైన విధులను నిర్వహించే సుమారు 10 లక్షల మంది సైనికుల జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఈ విధానం ముఖ్య ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

వంద రోజుల సెలవులను ఎలా అమలు చేయాలనే దానిపై హోం మంత్రిత్వశాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని సీఏపీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విధానాన్ని ఎప్పుడో అమల్లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ.. కరోనా కారణంగా సమస్యలు తలెత్తినట్లు ఆయన వెల్లడించారు. జవాన్ల 100 రోజుల సెలవుల సమయంలో విధులకు ఆటంకం కలగకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం, మహమ్మారి సంక్రమణను అరికట్టడంపైనా కేంద్రం దృష్టి సారించినట్లు సదరు అధికారి తెలిపారు.
వంద రోజుల సెలవులకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని, అమిత్ షాతోపాటు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ కూడా ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం జవాన్లకు సంవత్సరంలో 60-65 రోజుల వరకు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఈ సెలవుల విధానం అమలైతే కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్ బీతోపాటు అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ జీ, ఎన్డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నవారు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. కాగా, త్వరలోనే సీఏపీఎఫ్ లో 100 రోజుల సెలవు విధానం అమల్లోకి రానుంది.












Click it and Unblock the Notifications