ఆర్ బీఐ బోర్డులో ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు గురుమూర్తి నియామకం, కేంద్రం!
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, పాత్రికేయుడు ఎస్. గురుమూర్తి (తమిళనాడు), సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని భారత రిజర్వు బ్యాంక్ బోర్డులో ప్రత్యేక బోర్డు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత్ రిజర్వు బ్యాంకులో బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది.
భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యుల్లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు. భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులుగా గురుమూర్తి, సతీష్ కాశీనాథ్ మరాథెల నియమించాలని కేంద్ర మంత్రి వర్గం తీర్మానించి ఆర్థిక శాఖకు పంపించింది.
అర్థిక శాఖ అందుకు ఆమోదముద్ర వెయ్యడంతో ఎస్. గురుమూర్తి, సతీష్ కాశీనాథ్ మారాథెని భారత రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులుగా నియమిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు రాజకీయ వార పత్రిక తుగ్లక్ కు ఎస్ గురుమూర్తి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కు ఉప కార్యదర్శిగా ఎస్. గురుమూర్తి పని చేస్తున్నారు. ఎస్. గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. చాలకాలంగా ఆర్థిక, రాజకీయ విషయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న గురుమూర్తి బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుదారుడు.
గత సంవత్సరం ఎస్. గురుమూర్తి భారత రిజర్వు బ్యాంకు తీరుపై సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు చేశారు. రిజర్వు బ్యాంకు భారత వ్యవహారాలను నాశనం చేస్తోందని, అనేక బ్యాంకులను ప్రైవేటీకరణ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తోందని, ఇది చాల తప్పు అంటూ ట్వీట్ చేశారు.
సతీష్ కాశీనాథ్ మరాధె కాలేజీ రోజుల్లో ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. తరువాత ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాలు ఏబీవీపీ ట్రజరర్ గా పని చేశారు. అనేక జాతీయ బ్యాంకుల్లో 20 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.