తమిళనాట శశికళ సీక్రెట్ సర్వే.. జనం ఎటువైపు? తేలిందేంటి!?
అత్యంత రహస్యంగా జరిపిన ఈ సర్వేలో ఎక్కువమంది పన్నీర్ సెల్వం వైపే మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది.
చెన్నై: సుప్రీం తీర్పుతో శశికళ సీఎం కల 'కల'గానే మిగిలిపోగా తమిళనాడు రాజకీయాల్లో ఎడతెగని ఉత్కంఠకు ఓ ముగింపు పలికినట్టయింది. అయితే ఇక్కడినుంచి పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
సోమవారం రాత్రంతా నిద్రలేకుండా గడిపిన శశికళ సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యేలతో చర్చించారు. అయితే అంతకన్నా ముందు తమిళనాడులో ఆమె ఓ రహస్య సర్వే చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సర్వేలోను దాదాపు 98శాతం ప్రజలు ప్రతికూలంగా స్పందించడంతో ఆమె మరింత ఆందోళనకు లోనైనట్టు సమాచారం.
అత్యంత రహస్యంగా జరిపిన ఈ సర్వేలో ఎక్కువమంది పన్నీర్ సెల్వం వైపే మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కుర్చీని గనుక అధిష్టిస్తే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని శశికళ భావించారట. కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పాటు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలతో వారిని ఆకట్టుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఏదేమైనా సుప్రీం తీర్పుతో శశికళ ఆశలన్ని ఆవిరైపోయిన పరిస్థితి. ఏకంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంతీర్పు వెలువరించడంతో ఇన్నిరోజుల సంక్షోభానికి తెరపడినట్టయింది.