ఎన్నికలు: ఆర్టికల్ 35ఏపై విచారణ 2019 జనవరికి వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 35-ఏ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను వచ్చే 2019 జనవరి వరకు విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శుక్రవారం దీనికి సంబంధించిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు 2019 జనవరి రెండో వారంలో విచారణ చేస్తామని తెలిపింది.
'రాష్ట్రం(జమ్మూకాశ్మీర్)లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య వరకు జమ్మూకాశ్మీర్లో ఎనిమిది దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 35ఏ వంటి సున్నితమైన అంశం గురించి చర్చలు జరిగితే.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ముందు ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వండి. ఆ తర్వాత దీనిపై చర్చ చేపట్టవచ్చు' అంటూ జమ్మూకాశ్మీర్, కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు ప్రతిపాదన చేశారు.
కేంద్రం ప్రతిపాదనను పరిశీలించిన సుప్రీంకోర్టు అందుకు అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి వరకు దీనికి సంబంధించిన ఎటువంటి విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 19న దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.
కశ్మీరీల హక్కు ఆర్టికల్ 35ఏ: చెలరేగుతున్న వివాదం
కాగా, కాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టే రాజ్యాంగంలోని ఆర్టికల్-35ఏ అధికారణను రద్దు చేయాలని, దీని వల్ల జమ్మూకాశ్మీర్కు మిగతా రాష్ట్రాలకు మధ్య రాజకీయ అంతరాన్ని పెంచుతుందని సవాల్ చేస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు మరికొంత మంది కూడా 35ఏను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టి.. జనవరికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.