ధర్నా: కేంద్రం, కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ధర్నా పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ ధర్నాపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది.
కేజ్రీవాల్ ధర్నా సమయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ధర్నాపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కాగా కేజ్రీవాల్, ఎఎపి నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో నడి రోడ్డు పైన ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం ధర్నా చేశారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ డిమాండ్లపై మొదట తగ్గని కేంద్రం గణతంత్ర దినోత్సవాల దృష్ట్యా ధర్నా ప్రాంతాన్ని మార్చుకోవాలని సూచించింది. దానికి కేజ్రీవాల్ నిరాకరించారు. అయితే, మంగళవారం కేంద్రం ఇద్దరు పోలీసులను సెలవుల పైన పంపించేందుకు, మిగిలిన ముగ్గురుపై విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు అంగీకరించడంతో మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్ ధర్నాను ముగించారు. దీనిపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.